Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వస్త్రాలపై పన్నేసిన తొలి ప్రధాని మోడీ
- కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన కేంద్రం
- టెలీకాన్ఫరెన్స్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో చేనేత కార్మికులు ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె తారక రామారావు పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలపై పన్నేసిన తొలి ప్రధాని నరేంద్ర మోడీ అని విమర్శించారు. చేనేత కార్మికుల పొదుపు పథకం, బీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. దీంతో నేతన్నల భవిష్యత్తును అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని చేనేత కార్మికులతో సోమవారం మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చేనేత, టెక్స్టైల్ రంగానికి బీజేపీ సర్కారు తీరని ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని నేతన్నలకు గుర్తింపు, గౌరవం లభించిందనీ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి రూ.1,200 కోట్ల భారీ నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భారీగా యార్న్ సబ్సిడీ చేనేత మిత్ర పథకం ద్వారా అందిస్తున్నామని చెప్పారు. నేతన్నకు చేయూత పొదుపు కార్యక్రమం ద్వారా చేనేత కార్మికుల పొదుపు మొత్తానికి రెట్టింపుగా ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. ఈ పథకం ద్వారా కోవిడ్ సంక్షోభ కాలంలో సుమారు రూ.వంద కోట్లు రాష్ట్రంలోని నేతన్నలకు కాల పరిమితి కన్నా ముందుగానే అందించామని గుర్తు చేశారు. నేత కార్మికులకు జరిగిన భారీ లబ్ధి నేపథ్యంలో మరోసారి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. రైతు బీమా మాదిరే నేతన్నల కోసం రూ.ఐదు లక్షల బీమా సదుపా యాన్ని ఏర్పాటు చేశామన్నారు. రూ.లక్ష వరకు చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయడం ద్వారా 10,500 మందికి లబ్ది కలిగిందని వివరించారు. నారాయణపేటలో సమీకృత చేనేత అభివృద్ధి కేంద్రంతోపాటు గద్వాలలో చేనేత పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
నేతన్నలపై కేంద్రం కక్ష
ఇంత పెద్దఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడితే కేంద్రం మాత్రం నేతన్నలపైన కక్ష కట్టిందని కేటీఆర్ విమర్శించారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని చేనేత వస్త్రాలపైన పన్ను వేయలేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం జీఎస్టీ వేశారన్నారు. ఐదు శాతమున్న జీఎస్టీని 12 శాతానికి పెంచే కుట్రలు చేస్తున్నారని వివరించారు. స్వదేశీ మంత్రంతో అధికారం లోకి వచ్చిన మోడీ వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న నేత రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలకు అద్భుత వారసత్వంగా నిలిచిన చేనేత పరిశ్రమను పూర్తిగా దివాళా తీసేలా కేంద్రం చర్యలు ఉన్నాయన్నారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్స్ బోర్డ్, చేనేతల పొదుపు పథకం, చేనేతలకు ఉన్న భీమా పథకం, చేనేతల హౌస్ కం వర్క్ షెడ్ వంటి అన్ని కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి వారి పట్ల మోడీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తు న్నదని విమర్శించారు. చేనేతలకు గతంలో ఇచ్చే యార్న్ సబ్సిడీలను 40 నుంచి 15 శాతానికి తగ్గించి వస్త్రాల ఉత్పత్తిపై చావు దెబ్బ కొట్టిందని అన్నారు.
తెలంగాణకు కేంద్రం మొండిచేయి
చేనేతల కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా కేంద్రం నుంచి సహాయం అడిగితే మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని కేటీఆర్ విమర్శించారు. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే స్పందన లేదన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు వంటి విషయాల్లోనూ కేంద్రం నుంచి నిరాశే ఎదురైందని చెప్పారు. ఇలా అన్ని రంగాల్లో చేనేత కార్మికుల జీవితాలను చీకట్లోకి తోస్తున్న మోడీ ప్రభుత్వానికి, బీజేపీకి మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ నియోజకవర్గ పరిధిలోని కొయ్యల గూడెం, పుట్టపాక, గట్టుప్పల్, చౌటుప్పల్, చండూరు, మునుగోడు, నారాయణపురం, లింగోటం వంటి కేంద్రాల్లో ఉన్న నేతన్నల సంక్షేమం కోసం పనిచేస్తామనీ, కొయ్యల గూడెం, కుంట్లగూడెం ప్రాంతాలకు చెందిన స్థానిక సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలు మరింత బలంగా కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.