Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థులకు కటాఫ్ మార్కులుండవ్ : టీఎస్పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్-1 అభ్యర్థులకు కటాఫ్ మార్కులుండబోవని స్పష్టం చేశారు. మెయిన్స్కు ఎంపిక చేసేందుకు మాత్రమే గ్రూప్-1 ప్రిలిమ్స్ రాతపరీక్షను నిర్వహించామని వివరించారు. ప్రిలిమ్స్ ఆధారంగా 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తామని తెలిపారు. జోన్లలో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఖాళీలను బట్టి ఒక్కో క్యాటగిరిలో ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున మెయిన్స్కి అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారి కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ 1,019 పరీక్షా కేంద్రాలను టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసింది. వారిలో 2,86,051 (75 శాతం) మంది అభ్యర్థులు ఆదివారం నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. 503 గ్రూప్-1 పోస్టులకు 1:50 చొప్పున 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తారు. అంటే 2,86,051 మందిలో 25,150 మంది మెయిన్స్కు ఎంపికవుతారు.