Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నా
నవతెలంగాణ-మఫిసిల్ డెస్క్
వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం, 2వ ఏఎన్ఎం, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎం, ఈసీ ఏఎన్ఎం, ఇతర ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయాలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్, మహబూబ్ నగర్లో రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, నాగర్ కర్నూల్లో రాష్ట్ర కోశాధికారి ఫసియొద్దీన్, హైదరాబాద్లో కవిత, రంగారెడ్డిలో బలరాం, నిజామాబాద్లో సంజుజార్జ్, ఆదిలాబాద్లో నవీన్, నల్గొండలో భాస్కర్, జయశంకర్ భూపాలపల్లిలో సుధాకర్, ఖమ్మంలో ఏడు కొండల్, జనగాంలో అన్నంబికా ఇతర జిల్లాల్లో స్థానిక నాయకులు పాల్గొని మాట్లాడారు. 20 ఏండ్లుగా పనిచేస్తున్న ఎన్హెచ్ఎంలోని రెండవ ఏఎన్ఎంలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు, ఇతర ఉద్యోగులందరికీ ప్రభుత్వం కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత ఇతర చట్టబద్ధ హక్కులు అమలు చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేయడం సమంజసం కాదన్నారు. ఏక కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాలు సమర్థవంతంగా అందిస్తున్న వారు విపరీతమైన పని ఒత్తిడితో మానసికంగా, శారీరకంగా కుంగిపోయి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుభూతితో ఆలోచించి కాంట్రాక్టు ఏఎన్ఎంలు అందరినీ యధావిధిగా రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.31,040తో పాటు డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు ఇవ్వాలని, యూనిఫామ్ అలవెన్సు రూ.2500, వ్యాక్సిన్ అలవెన్సు రూ.500, సబ్ సెంటర్ అద్దె రూ.1500లతో పాటు స్టేషనరీ, జిరాక్స్ ఖర్చులు కూడా ఇప్పించాలని కోరారు. 35 రోజులు క్యాజువల్ లీవ్లు, 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్లు, మెడికల్ లీవ్లు వర్తింపచేయాలని, నైట్ డ్యూటీలు, ఓపీ డ్యూటీలు రద్దు చేయాలని తెలిపారు. బదిలీలకు అవకాశం కల్పించాలని, విధి నిర్వహణలో చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఫీల్డ్ డ్యూటీ చేస్తున్నందున ఎఫ్టీఏ సౌకర్యం కల్పించాలని, హెచ్.ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించి పీహెచ్సీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమస్యలు వెంటనే పరష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డీఎంహెచ్ఓలకు వినతి పత్రాలు అందజేశారు.