Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్న ఐఎస్బీ
- ఉన్నత విద్యామండలి, విద్యాశాఖతో ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉన్నత విద్య పరీక్ష విధానంలో గుణాత్మక మార్పులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ శుక్రవారం హైదరాబాద్లో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించే పరీక్ష విధానం భవిష్యత్లో వారికి గుర్తింపునిచ్చేదిగా, ఉపాధికి బాటలు వేసేదిగా ఉండాలన్నదే ఈ ఒప్పందం లక్ష్యమని ఉన్నత విద్య మండలి ప్రకటించింది. ఇప్పుడున్న పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ఐఎస్బీ అధ్యయనం చేసి, ఆరు నెలల్లో నివేదిక ఇవ్వనుందని తెలిపింది. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన పరీక్షలు ఎలా ఉండాలనేది క్షేత్రస్థాయిలో అధ్యయనం ద్వారా తెలుసుకునే అవకాశమున్నది. అంతర్గత పరీక్షలతో సహా కాలేజీ విద్యలో జరిగే అన్ని పరీక్షల విధానాలనూ పరిశీలించి, సరికొత్త విధానాన్ని రూపకల్పన చేసి కొన్ని సిఫారసులను చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ఎలా పెంపొందించా లనేది ప్రధాన అంశంగా ఉండనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ నూతన ఆలోచనా విధానం, భవిష్యత్ మార్పుల విషయంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. తాజా ఒప్పందం దీనికి నిదర్శనమన్నారు. విద్యావిధానంలో విద్యార్థుల నైపుణ్యాన్ని సరికొత్తగా వెలికి తీసేందుకు అధ్యయనం తోడ్పడుతుందని వివరించారు. ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ ప్రస్తుత పరీక్షలు, మూల్యాంకన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థి కూడా ఉపాధి విషయంలో సవాళ్లు ఎదుర్కొంటు న్నారని అన్నారు. విద్యార్థుల్లోని లోతైన ఆలోచనా విధానాన్ని, సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని అంచనా వేయాలని భావిస్తున్నామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానంలో వారి జ్ఞాపకశక్తిని మాత్రమే అంచనా వేస్తున్నామని వివరించారు. ఐఎస్బీ దీనిపై సమగ్ర అధ్యయనం చేసి, సరైన మూల్యాంకన విధానం, బోధనా ప్రణాళిక తీరు, బోధనలో మెళకువల్లో తీసుకురావాల్సిన మార్పులను సూచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల, ప్రొఫెసర్ చంద్రశేఖర్ శ్రీపాద, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ఏజీవో డి తిరువెంగళచారి, జేడీ డీఎస్ఆర్ రాజేంద్ర సింగ్, ఆర్జేడీ జి యాదగిరి, దోస్త్ కోఆర్డినేటర్ గజేంద్రబాబు పాల్గొన్నారు.