Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులను పక్క స్కూళ్లలో సర్దుబాటు చేయండి
- హైదరాబాద్ డీఈవోకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎల్కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన హైదరాబాద్లో ఉన్న బంజారాహిల్స్లోని బీఎస్డీ డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న స్కూళ్లలో సర్ధుబాటు చేయాలని కోరారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా డీఈవోదేనని శుక్రవారం మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసు కోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కమిటీలో పాఠశాల విద్యాశాఖ సంచాల కులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ కమిటీ నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.