Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారెక్కిన మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ :సీఎం కేసీఆర్తో భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు నచ్చక మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ ఆ పార్టీని వీడారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా ఆయన భేటీ అయ్యారు. అనంతరం తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు, టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పార్టీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేత కుటుంబం నుంచి వచ్చిన తాను బీజేపీ చేస్తున్న ఈ నిర్వాహకాన్ని చూస్తూ భరించలేకనే ఆ పార్టీని వీడానని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.