Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 1 నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా
- 9 నుంచి 16 వరకు నిర్వహణ
- సవరణ షెడ్యూల్ జారీచేసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షల నిర్వహణపై మనుగోడు ఎన్నికల ప్రభావం పడింది. వచ్చేనెల మూడున మునుగోడు నియోజకమర్గంలో పోలింగ్, ఆరున ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. దీంతో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఎస్ఏ-1 పరీక్షలు వాయిదా పడ్డాయి. వచ్చేనెల తొమ్మిది నుంచి ఆయా పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సవరణ షెడ్యూల్ను మంగళవారం విడుదల చేశారు. వచ్చేనెల తొమ్మిది నుంచి 16వ తేదీ వరకు ఎస్ఏ-1 పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఆరు పేపర్లతోనే ఎస్ఏ-1 పరీక్షలను నిర్వహిస్తామంటూ ఈనెల 12న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది. 11 పేపర్లతో కూడిన ప్రశ్నాపత్రాలను రూపొందించి అధికారులు ముద్రించారు. మళ్లీ విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన స్పందించి తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షలను ఆరు పేపర్లు కాకుండా 11 పేపర్లతోనే నిర్వహిస్తామంటూ ఈనలె 19న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం లేకపోలేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చేనెల తొమ్మిది నుంచి 16వ తేదీ వరకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పేపర్-2 పరీక్షలను వారు రాయాల్సి ఉంటుంది. ఎస్ఏ-1 పరీక్షల వరకే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎస్ఏ-2తోపాటు ప్రీఫైనల్, వార్షిక పరీక్షలను మాత్రం ఆరు పేపర్లతోనే నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.