Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల కమిషన్లో ప్రజా సంఘాల ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరావత్ నిఖిల్ హత్య కేసులో పోలీసుల వైఫల్యం ఉందంటూ గురువారం తెలంగాణ గిరిజన సంఘం, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ, ఆలిండియా బంజారా సంఘం, గిరిజన శక్తి తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిఖిల్ తండ్రి దరావత్ భాస్కర్ హైదరాబాదులోని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉపసంచాలకులు చంద దాస్, మానవ హక్కుల కమిషన్లో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థి ధరావత్ నిఖిల్ హత్య జరిగి 20 రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసులు నిందితులను గుర్తించలేదని తెలిపారు. నిఖిల్ది ముమ్మాటికీ కుల దురహంకార హత్యేనని ఆరోపించారు. జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిఖిల్ అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనీ, వారే సుపారీ ఇచ్చి తన స్నేహితుల సహకారంతో హత్య చేయించినట్టు కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తున్నదని తెలిపారు. స్నేహితుల మధ్య తగాదాగా చిత్రీకరించి ఆత్మహత్య కోణంలో కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్బాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఆలిండియా బంజారా సంఘం జిల్లా ఇన్చార్జ్జి ధరావత్ వీరన్న నాయక్, కేవీపీఎస్్ జిల్లా కార్యదర్శి కోట గోపి, గిరిజన శక్తి నాయకులు వెంకటేష్ నాయక్, గిరిజన సంఘాల నాయకులు డాక్టర్ ఆనంద్ నాయక్, జితేందర్ నాయక్, ధర్మానాయక్, మంగతా నాయక్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.