Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.కోటికి లక్ష కమీషన్?
- టీంలను ఏర్పాటు చేసుకుంటున్న రాజకీయ నాయకులు
- పోలీసుల కండ్లు గప్పేందుకు ఎత్తుకు పైఎత్తులు
- కొత్త మార్గాల్లో డబ్బు తరలింపు యత్నాలు
నవతెలంగాణ- నల్లగొండ
మునుగోడులో గెలుపు కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్న పార్టీలు ఓటర్లకు పోటీపడి తాయిలాలు ప్రకటిస్తున్నాయి. నియోజకవర్గంలోకి మద్యం, డబ్బు ప్రవేశించకుండా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు రాజకీయ పార్టీలు పైఎత్తులు వేస్తున్నాయి. డబ్బును సురక్షితంగా మునుగోడుకు తరలించేందుకు ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటుచేసుకుని కోటికి లక్ష కమిషన్ ఇస్తున్నాయి.
తెలంగాణలో హుజూరాబాద్ తరువాత మునుగోడు ఉపఎన్నిక ఖరీదైనదిగా మారింది. కాంగ్రెస్, వామపక్షాలకు కంచుకోటైన నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ, 2014లో విజయం సాధించిన టీఆర్ఎస్ తిరిగి అక్కడ పాగా వేయాలని చూస్తోంది. ఆ నియోజకవర్గంలో ఎలాంటి ప్రాతినిథ్యం లేని బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వలసొచ్చిన రాజగోపాల్ రెడ్డి ద్వారా అక్కడ పాగా వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు ఏదో ఒక విధంగా ఉపఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో మూడు పార్టీలు కూడా పోటీపడి డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేయడంతోపాటు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. డబ్బు, మద్యం కట్టడికి పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖలు పటిష్ట చర్యలు చేపట్టాయి. దాదాపు 40 వరకు తనిఖీ కేంద్రాలు, మొబైల్ పార్టీలు ఏర్పాటుచేసి వాహన సోదాలు ముమ్మరం చేస్తున్నారు.
నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మునుగోడు ఎన్నికలకు సంబంధించి పెద్ద మొత్తంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తోపాటు పెద్దమొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు డబ్బులను నియోజకవర్గానికి చేరవేసేందుకు సిద్ధమైన సందర్భంలోనే పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకుంటున్నారు. మరొకవైపు డబ్బు, మద్యం అక్రమంగా తరలించేందుకు రాజకీయ పార్టీలు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం.
రూ.కోటికి లక్ష కమీషన్..
కోటి రూపాయలను సురక్షితంగా చేర్చినట్టయితే అందుకు కమీషన్ కింద లక్ష రూపాయిలు ఇచ్చేందుకు పార్టీలు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో ఇటీవల ఓ రాజకీయ పార్టీ నుంచి మర్రిగూడ మండలానికి ఆరు కోట్ల నగదు చేర్చేందుకు ఇదే తరహా ఒప్పందం కుదుర్చుకున్నట్టు వినికిడి. ఆ బృందం రెండు విడతల్లో మూడేసి కోట్ల లెక్కన ఒకసారి బియ్యం బస్తాల్లో, మరొకసారి యూరియా బస్తాల్లో మర్రిగూడకు చేర్చినట్టు సమాచారం. ఇందుకు ఆరు లక్షల రూపాయిలు కమీషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాహనాలు తనిఖీలు చేసినా దొరకని రీతిలో బియ్యం బస్తా మధ్యలో నోట్ల కట్టలు పెడుతున్నారు.రెండు మూడు బస్తాల్లో నోట్ల కట్టలు పెట్టి పది నుంచి 20 బస్తాలు ఒకేసారి తరలిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా బియ్యం బస్తాలుగా భావించి వదిలేస్తున్నారు. యూరియా బస్తా మధ్య నోట్ల కట్టలు పెడుతున్నారు. కనీసం పది బస్తాలు యూరియా రవాణా అయ్యేట్టు వాహనం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పోలీసులు తనిఖీలు చేసినా గుర్తించేందుకు అవకాశం లేని రీతిలో పైఎత్తులు వేసి నగదు రవాణా చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మునుగోడు ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పది కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించారు. ఐదు కంపెనీల కేంద్ర బలగాలను ఇప్పటికే నియోజకవర్గానికి పంపగా, మరో 5 కంపెనీలు ఈ నెల 30వ తేదీన రానున్నాయి.