Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్య రుసుంతో డిసెంబర్ 29 వరకు చెల్లించే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు గడువు వచ్చేనెల 15 వరకు ఉన్నది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.50తో వచ్చేనెల 30 వరకు, రూ.200తో డిసెంబర్ 15 వరకు, రూ.500తో అదేనెల 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. ఆయా తేదీల్లో సాధారణ సెలవులుంటే మరుసటి రోజు చెల్లించొచ్చని సూచించారు. విద్యార్థులు ఇతర సమాచారం కోసం www.bse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. వచ్చేఏడాది మార్చిలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులంతా సకాలంలో ఫీజు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకూ రూ.125 ఫీజు చెల్లించాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులు మూడు సబ్జెక్టుల కంటే తక్కువుంటే రూ.110, ఎక్కువుంటే రూ.125 కట్టాలని తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు రూ.125తోపాటు రూ.60 అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.24 వేల కంటే తక్కువుంటే వారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని వివరించారు. తరి పొలం 2.5 ఎకరాల కంటే తక్కువ, మెట్ట పొలం ఐదెకరాల్లోపుంటే ఆ విద్యార్థులకూ ఫీజు మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం ఎంఆర్వో (తహశీల్దార్) ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు.