Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అందరి సహాయ సహకారాలతో మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ వెల్లడించారు. గురువారం రాత్రి హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటరు స్లిప్పులు ఇచ్చామని తెలిపారు. పోలింగ్ మొత్తం పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల బయట స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నారు.
మునుగోడులో మూడు చోట్ల ఈవీఎంలు, నాలుగు వీవీప్యాట్లు మార్చారని వివరించారు. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6,100 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ. 8.27 కోట్ల నగదు, ఇతర వస్తువులను పోలీసులు, అధికారులు సీజ్ చేశారనీ, 3.29 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మునుగోడులో గురువారం ఒక్కరోజే 98 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. స్థానికేతరులను గుర్తించడంలో తాము నియమించిన బృందాలు బాగా పని చేశాయన్నారు. 70 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపామని చెప్పారు.