Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్
- ఓయూలో జాతీయ సెమినార్
నవతెలంగాణ-ఓయూ
దేశంలో అత్యంత ప్రమాదకరంగా ప్రధాని మోడీ పాలన సాగుతోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రొఫెసర్ జి.రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో ''సోషల్ ట్రాన్ఫ్ర్మేషన్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డెమోక్రసీ'' అంశంపై శనివారం జాతీయస్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అత్యున్నత వ్యవస్థలైన ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్, జ్యూడీషియల్, మీడియా స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నాయని చెప్పారు. పాలకుల ఒంటెద్దు పోకడలతో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత చైతన్యవంతులై ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సామాజికవేత్తలు కండ్లు పెట్టి చూడాలని, చెవులు పెట్టి వినాలని, గొంతెత్తి మాట్లాడాలని, సదస్సులు నిర్వహించి ప్రజలను కదిలించాలని కోరారు. ఉద్యోగాలను సాధించడం నిరుద్యోగుల హక్కు అని, ఉద్యోగాలు ఇప్పించడం, ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని చెప్పారు.
ఈ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ తన పాలనను ప్రజాస్వామ్యానికి భిన్నంగా సాగిస్తున్నారన్నారు. గౌతం అదానినీ పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. బ్యాంకులో నుంచి రెండున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలను అదాని తీసుకున్నారని, ఒకవేళ అదాని వ్యాపారాలు దెబ్బతింటే దేశ ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో.. 70 శాతం విరాళాలు ఒక్క బీజేపీకే దక్కుతున్నాయని వివరించారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వెనుకబడిన తరగతుల పజల ఉపాధి అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సెమినార్లో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రముఖ ఆర్థికవేత్త సిహెచ్.హనుమంతరావు, న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీల టీచర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.