Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు కౌంటింగ్ పూర్తి
- ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్నికల అధికారులు
- చౌటుప్పల్ నుంచి లెక్కింపు షురూ... మూడంచెల భద్రత
నవతెలంగాణ-నల్లగొండ/మిర్యాలగూడ
రాష్ట్రంలో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్ హాల్లో వసతుల కల్పన పూర్తయ్యాయి. ఒకే హాల్లో 21 టేబుళ్లపై 15 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్ మధ్యాహ్నం ఒంటి గంటలోపు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 2,41,855 ఓట్లకుగాను 2,25,192 ఓట్లు (93.16శాతం) పోలయ్యాయి. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతంగా నిలిచింది. మునుగోడులో 2014లో జరిగిన ఎన్నికల్లో 82.14 శాతం, 2018లో జరిగిన ఎన్నికల్లో 91.30శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఉపఎన్నికల్లో 93.13 శాతంగా నమోదై గత రికార్డులను తిరగరాసింది. ఈ క్రమంలో అందరి దృష్టి ఈ రోజు విడుదలయ్యే మునుగోడు ఉపఎన్నికల ఫలితాలపై ఉంది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ గెలుపు తమదేనంటే తమదేనంటూ దీమాతో ఉన్నాయి. అయితే, ఓటరు తీర్పు ఎలా ఉండేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.
తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్లలో భద్రపర్చారు. వీటి వద్ద రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి నేతృత్వంలో లెక్కింపు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ టేబుళ్ల వద్ద అభ్యర్థులు లేదా పార్టీ ఏజెంట్లు కూర్చోవడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూమ్లు తెరుస్తారు. తొలుత ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఏడు మండలాల్లో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో 298 ఈవీఎంలను వినియోగించారు. గంటకు 3 నుంచి 4 రౌండ్ల ఫలితాలు వెల్లడి కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంటకల్లా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మూడంచెల భద్రత..
జిల్లా ఎన్నికల అధికారి వినయ్కృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారి రోహిత్సింగ్తోపాటు కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగనున్నది. లెక్కింపు నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేయగా, 24గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుంది.చౌటుప్పల్ నుంచి మొదలు..ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్ చౌటుప్పల్ మండలం నుంచి మొదలు కానున్నది. తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల లెక్కింపు జరగనున్నది. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ కేంద్రాల చొప్పున కౌంటింగ్ చేపడుతారు.మండలాల వారీగా నమోదైన పోలింగ్ శాతం చౌటుప్పల్ 93.75శాతం, నారాయణపురం 93.76, చండూరు 93.51, గట్టుప్పల్92.61, మర్రిగూడ 91.41, మునుగోడు 93.50, నాంపల్లి 92.37 శాతం పోలింగ్ నమోదైంది.