Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్ మాట్లాడుతూ.. హాస్టల్ భవనంపై నుంచి దూకిన వైనం
నవతెలంగాణ-కంఠేశ్వర్/మాక్లూర్
పాలిటెక్నిక్ విద్యార్థిని ఓ ప్రయివేటు హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ నగర శివారులోని ముబారక్నగర్ ప్రాంతంలో ఓ ప్రయివేటు హాస్టల్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేటకు చెందిన అక్షిత (17) విజరు ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో తన తల్లితో ఫోన్ మాట్లాడేందుకు పై అంతస్తులోకి వెళ్ళింది. ఎంతకీ తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ కిందకు విసిరేసి ఆ భవనంపై నుంచి దూకింది. తీవ్ర గాయాలవడంతో నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందింది. తమ కూతురు చనిపోయినట్టు తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన నిజామాబాద్కు చేరుకొని కూతురి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ నరహరి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా, విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై పోలీసులు నిజనిజాలను విచారణ చేసి ఆమె తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. నిరసనలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు విశాల్, మహేష్, జిల్లా నాయకులు సందీప్, తదితరులు పాల్గొన్నారు.