Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ వైద్యవిద్యా రంగంలో చారిత్రక సందర్భం చోటుచేసుకున్నది. మంగళవారం ప్రగతి భవన్లో ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ కాలేజీల్లోని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను ఆన్లైన్లో ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులను సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. మరిచిపోలేని రోజు. ఒకనాడు అనేక సమస్యలతో త్రాగునీటికి, సాగునీటికి, కరెంటుకు, మెడికల్ సీటుకి, ఇంజనీరింగ్ సీటుకు ఎన్నో అవస్థలు పడ్డాం. స్వరాష్ట్రాన్ని సాధించుకుని, అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతూ దేశానికి మార్గదర్శనం చేస్తూ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం గర్వకారణం. గతంలో మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యపేట, ప్రస్తుతం సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూలు, రామగుండంలో ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా మహబూబాబాద్ వంటి గిరిజన ప్రాంతంలో, వనపర్తి వంటి మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని చెప్పి కలలో కూడా ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఉద్యమకారుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్రావు కృషితోనే కళాశాలల నిర్మాణం రూపుదాల్చిందని అభినందనలు తెలిపారు. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కళాశాల రావాలని మనం సంకల్పించుకున్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల సంఖ్య 17 కు పెరిగాయి. 16 జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. మరో 17 జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీటి నిర్మాణం చేపట్టేందుకు సూత్రప్రాయంగా క్యాబినేట్ ఆమోదం తెలిపింది. రాబోయే రోజుల్లో మిగిలిన 17 కాలేజీల నిర్మాణం కూడా చేపట్టి, భగవంతుడి మన్సిస్తే వీటి ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తానని విన్నవిస్తున్నాను. గతంలో 850 ఎంబిబిఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండేవి. వాటి సంఖ్య 2,790 కి పెరిగింది. అదే విధంగా పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు మనం గణనీయంగా పెంచుకున్నాం. గతంలో 531 పీజీ సీట్లు ఉంటే, ప్రస్తుతం 1,180 పిజి సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 మాత్రమే ఉంటే, ప్రస్తుతం 152 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దళిత, గిరిజన, బడుగు బలహీన, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం.. అన్నారు.
జనాభా నిష్పత్తికి అనుగుణంగా డాక్టర్లు అందుబాటులో ఉండడం ఎంత అవసరమో, పారా మెడికల్ సిబ్బంది సిబ్బంది ఉండడం అంతే అవసరం. అదే వైద్య రంగ పటిష్టతను సూచిస్తుంది. ఈ దిశగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అన్ని ప్రాంతాల్లో సమతూకంగా ఉండేట్టు వీటి ఏర్పాటు జరుగుతున్నది. ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఒకే నియోజకవర్గంలో ఉన్నా, వీటి సమగ్రాభివృద్ధి జరగాలనీ రెండు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేశాం. ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా గొప్ప రక్షణ కవచంగా ఉండాలని వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు త్వరలోనే ప్రారంభించుకునేలా వైద్యారోగ్య శాఖామాత్యులు హరీష్ రావు చర్యలు చేపడతారు....అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ఎస్.మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తాతా మధుసూధన్ రావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వర్ రావు, డాక్టర్ సంజరు కుమార్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్ రెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, వైద్యశాఖ అధికారులు గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.