Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ 35వ మహాసభలను జయప్రదం చేయండి.
- తెలంగాణ రైతు సంఘం నాయకులు చంద్రారెడ్డి, టి. సాగర్ పిలుపు
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, వ్యవసాయరంగ రక్షణ కోసం పోరాడుతున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెేఎస్్) 35వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది. బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏఐకేఎస్ జెండాను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంతల చంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కనీస మద్దతు ధరల చట్టం చేస్తామనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరిస్తామంటూ హామీ ఇచ్చిందనీ, నేటి వరకు మద్దతు ధరల చట్ట ప్రయత్నం చేయలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఏటా 10వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏరకమైన ప్రయత్నం చేయలేదన్నారు. రైతుల రుణమాఫీ చేయడం చేతగానీ బీజేపీ సర్కారు...కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ 11లక్షల కోట్ల రాయితీలు ఇచ్చిందన్నారు. పంటల బీమా పథకం రైతాంగాని కంటే ఇన్సూరెన్స్ కంపెనీలకే ఉపయోగపడేలా ఉందన్నారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని రూ.18,000లకు పెంచాలని కోరారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13 నుంచి 16 వరకు కేరళ రాష్ట్రంలోని త్రిసూర్లో జరుగుతున్న ఏఐకెఎస్ మహాసభల జయప్రదం చేయాలని కోరారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలు జరిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అరిబండి ప్రసాద్రావు, పి.జంగారెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.