Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈవోకు టీఎస్యూటీఎఫ్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటర్ల నమోదులో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందనీ, వాటిని నిరోధించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) డిమాండ్ చేసింది. అర్హులైన ఓటర్లు మాత్రమే నమోదయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ను బుధవారం హైదరాబాద్ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి కలిసి ఫిర్యాదు చేశారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసు వివరాలను ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం పరిశీలించకుండానే అధికారులు కౌంటర్ సిగేచర్ చేస్తున్నారని విమర్శించారు. కోవిడ్ అనంతరం నియామకమైన జూనియర్ ఉపాధ్యాయులను (లోగడ ఏ విద్యాసంస్థలోనూ పనిచేసిన అనుభవం లేకున్నా) కేవలం మూడు నెలల పే స్లిప్స్ ఆధారంగా సర్వీస్ సర్టిఫికెట్లపై కౌంటర్ సిగేచర్ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలకు భిన్నంగా రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఉత్తర్వులు బోగస్ ఓట్ల నమోదుకు అవకాశం కలిగిస్తున్నదనీ, ఆ ఉత్తర్వులను రద్దు చేసి, డీఈఓపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ఇచ్చిన సర్వీస్ సర్టిఫికెట్ ఆధారంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నడుస్తున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొందరు ఓటరుగా నమోదయ్యారని పేర్కొన్నారు. యూపీఎస్ ఉపాధ్యాయులు ఓటరుగా నమోదుకు అర్హులా? కాదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. తద్వారా యూపీఎస్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదయ్యే వీలుంటుందని సూచించారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య కళాశాలల ఉపాధ్యాయుల పేరుతో కొందరు సర్వీసు సర్టిఫికెట్లపై డిజిగేటెడ్ అధికారి (యూనివర్సిటీ రిజిస్ట్రార్) సంతకం లేకుండానే ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించినట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఓటర్ దరఖాస్తులన్నింటినీ ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారినే నమోదు చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని తెలిపారు. ఈనెల 23న ప్రచురించబోయే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటరు పనిచేస్తున్న విద్యాసంస్థ పేరును స్పష్టంగా ప్రకటించాలని సీఈవోకు విజ్ఞప్తి చేశారు. ఓటరు నమోదులో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామనీ, అక్రమాలు జరిగినట్టు గమనిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.