Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన తెలంగాణ-మన సంస్కృతి-మన పర్యాటకం ఆశయంతో ముందుకు
- ఎనిమిదేండ్లలో 63.51 కోట్ల టూరిస్టుల సందర్శన
- అందులో 1.35 లక్షల మంది విదేశీ పర్యాటకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన తెలంగాణ-మన సంస్కృతి-మన పర్యాటకం ఆశయంతో పర్యాటక రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు ముందుకుసాగుతున్నది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకం వికసిస్తున్నది. కొండకోనలు.. జలపాతాలు..చారిత్రక కట్టడాలు.. కోటలు.. ఆధ్యాత్మిక ప్రదేశాలు..ఆహ్లాదపరిచే అడవులతో నెలవాలైన తెలంగాణం పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నది. 2014 నుంచి 2022 వరకు రాష్ట్రంలో 63.51 కోట్ల పర్యాటకులు సందర్శించడమే దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. 1.35 లక్షల లక్షల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించింది. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక రంగం నూతన జవసత్వాలను పోదుపోసుకున్నది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సహజ వనరుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాష్ట్రాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 54 హరిత టూరిజం హౌటల్స్, వేసైడ్ వసతులను కల్పించింది. పర్యాటక రంగానికి అనువైన ప్రాంతాల్లో వసతులను అభివృద్ధి చేస్తున్నది. పర్యాటక శాఖ 31 టూరిజం బస్సులు,120 బోట్లను నడుపుతున్నది. గోల్కొండ, వరంగల్ కోట ల వద్ద సౌండ్, లైట్షోలను నిర్వహిస్తున్నది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో డ్రామాటిక్గా ఈ కోటల కథనాలను గాత్రాలు, సంగీతం, లైట్ ఎఫెక్ట్ తో ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులతో భూదాన్ పోచంపల్లికి ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి గుర్తింపు లభించింది. నాగార్జున సాగర్ వద్ద రూ. 65 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్ను అభివృద్ధి చేసింది. ములుగు జిల్లా మేడారం గ్రామంలో సమ్మక్క - సారలమ్మ జాతరకు రూ.13.43 కోట్లతో పర్యాటక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లక్నవరం వద్ద రూ.27.65 కోట్లతో అదనపు వసతులను ఏర్పాటు చేసింది. తాడ్వాయిలో రూ.9.36 కోట్లు, గట్టమ్మ గుట్ట వద్ద రూ.7.36 కోట్లు, మల్లూరు వద్ద రూ.4.20 కోట్లు, బొగత వాటర్ ఫాల్స్ వద్ద రూ.11.64 కోట్లు, సోమశిల రిజర్వాయర్ వద్ద రూ.20.87 కోట్లు, సింగోటం రిజర్వాయర్ వద్ద రూ.7.84 కోట్లు, శ్రీశైలం ఈగలపెంట వద్ద రూ.25.96 కోట్లు, ఫర్హాబాద్ మన్ననూరు వద్ద రూ.13.81 కోట్లు, మల్లెల తీర్ధం వద్ద రూ.5.35 కోట్లు, అక్క మహాదేవి గుహలు వద్ద రూ.1.25 కోట్లతో కల్పించిన పర్యాటక వసతులను ప్రజలకు అందుబాటులో ఉంచింది. అనేక చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నది. వీటితో పాటు అన్ని జిల్లాలలోని పర్యాటక ప్రాంతాల్లో వసతులు అభివృద్ధి చేసి అంతర్గత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నది. దీంతో డోమెస్టిక్తో పాటు విధేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతున్నది. పర్యాటక రంగం అభివృద్ధితో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.