Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయు జర్నలిజం హెచ్వోడీ ప్రొఫెసర్ స్టీవెన్సన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచంలో డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు కూడా మారాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం హెచ్వోడీ, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె స్టీవెన్సన్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ సిఎఫ్ఆర్డీ భవనంలో ''జర్నలిజం ఇన్ ది డిజిటల్ ఏజ్'' అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. కాలానుగుణంగా జర్నలిజం వృత్తిలో అనేక మార్పులు వచ్చాయన్నారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని పత్రికలు, ఛానళ్లు ముందుకు నడుస్తున్నాయన్నారు. వార్తా సేకరణ, ప్రసారంలో డిజిటల్ ఫార్మాట్కు ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. జర్నలిస్టులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తేనే పోటీ రంగంలో సులువుగా ముందుకు వెళ్లగలుగుతారని తెలిపారు. అయితే ఇన్వేస్టిగేషన్ జర్నలిజం కూడా పెరగాలన్నారు. గతంలో పోల్చితే ప్రస్తుత జర్నలిజం వృత్తిలో పరిశోధనాత్మక రిపోర్టింగ్ తగ్గిందన్నారు. సమాజ మార్పుకు జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. ప్రజల నిత్య జీవితంలో ముడిపడిన అంశాలపై రీసెర్చ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడబ్లూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి ఆనందం, హెచ్యుజె అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఇ చంద్రశేఖర్, నిరంజన్, గుడిగ రఘు, బివిఎన్ పద్మరాజు, రామకృష్ణ, హెచ్యుజె ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగవాణి, ట్రెజరర్ రాజశేఖర్, ప్రతినిధులు నవీన్, రమేష్తోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.