Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- నివాళులు అర్పించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
తుదిశ్వాస వరకు ఎర్రజెండా బాటలో నడిచిన ధన్యజీవి మేకల రాయమల్లు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మేకల రాయమల్లు శనివారం మృతిచెందారు. కొత్తగూడెం, చుంచుపల్లి మండలం బాబు క్యాంపులో రాజమల్లు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తమ్మినేని మాట్లాడారు. మేకల రాయమల్లు విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలా నికి ఆకర్షితులై పార్టీలో చురుకైన కార్యకర్తగా పని చేశారన్నారు. సింగరేణిలో సీఐటీయూ నాయకుడిగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పని చేశారన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలతో పాటు చుంచుపల్లి ప్రాంతంలో నవతెలంగాణ దినపత్రిక చేర్పించి ప్రతిరోజూ చందాదారులకు పేపర్ అందించి పార్టీ భావాజాలన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషించారని గుర్తుచేశారు.
తాను పార్టీలో పని చేయడమే కాకుండా తన యావత్తు కుటుంబాన్ని పార్టీకి అంకితం చేశారని కొనియాడారు. వ్యక్తి జీవితం కన్నా సామాజిక జీవనమే గొప్పదని నమ్మి చివరి వరకు ప్రజా పోరాటాలలో మమేకమై పోరాడిన ఆదర్శ కమ్యునిస్టు అని కొనియాడారు. కష్టాలు ఆంటకాలు ఎదురైన నమ్మిన సిద్ధాంతం కోసం ఎర్రజెండా నీడలో చివరి వరకూ నడిచిన రాయమల్లు బాటలో నడిచి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ప్రభాకర్, సీనియర్ నాయకులు పి.రాజారావు, కాసాని ఐలయ్య, గుగులోత్ ధర్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, సీపీఐ(ఎం) ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్, కొక్కెరపాటి పుల్లయ్య, తదితరులు ఉన్నారు.