Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్దిదారుల నుంచి దర్జాగా దోపిడీ చేస్తున్న అక్రమార్కులు
- బర్రెలు, గొర్రెల యూనిట్లలో భారీగా అక్రమాలు
- ఒక్కో లబ్దిదారు నుంచి లక్షల్లో హంఫట్
- లబోదిబోమంటున్న దళితులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం.. అక్రమార్కులు చేరి అందినకాడికి దోచుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో భారీ కుంభకోణానికి తెరలేపారు. లబ్దిదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా లక్షల్లో వెనకేసుకున్నారు. బర్రెలు ఒక్కో యూనిట్కు ఏకంగా రూ.1.80లక్షల నుంచి రూ.1.90లక్షల బిల్లులు వేసి ఒక్కో యూనిట్లో రూ.80-85 వేల వరకు నొక్కేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా నాలుగు యూనిట్ల చొప్పున అంటే ఒక్కో లబ్దిదారుడి నుంచి ఏకంగా రూ.3 లక్షల వరకు మిగుల్చుకున్నారు. పైగా ట్రాన్పోర్టు ఖర్చులు అదనం. మండలానికి ఆనుకొని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఉన్నప్పటికీ.. మధ్యవర్తి ఒత్తిడితో ఉద్దేశపూర్వకంగా ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి గొర్రెలను తీసుకొచ్చారని తెలుస్తోంది. ఆ ప్రాంతం నుంచి రవాణా సమయంలోనే పదుల సంఖ్యలో గొర్రెలు చనిపోవడం గమనార్హం. ఇక ఈ గొర్రెల నిర్వహణ తమతో కాదన్న లబ్దిదారుల నుంచి మళ్లీ అదే మధ్యవర్తి అగ్గువకు కొని మరో లబ్దిదారునికి ఇచ్చినట్టుగా రికార్డులకు ఎక్కించి లక్షలు దోచేసిన సంఘటనలు కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలులో భాగంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున దళితబంధు అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 1298 దళిత కుటుంబాలను గుర్తించారు. ఇందులో 1296 మంది లబ్దిదారులు కోరుకున్న యూనిట్లయిన వరికోత మిషన్లు, జేసీబీలు, ట్రాక్టులు, రవాణా వాహనాలు, కార్లు, టెంట్హౌస్, సెంట్రిఫ్, ఫిష్పాండ్.. ఇలా రూ.128.30 కోట్ల విలువ గల వాటిని అందజేశారు. ఇందులో పాడి గేదెలు, మేకల పెంపకం అమలు చేశారు. లబ్దిదారుని ఇష్టానుసారం యూనిట్లు ఎంపిక చేయాల్సి ఉండగా.. కొంతమందికి గొర్రెలు, పాడి గేదెలకు ఎంచుకోవాలని అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో చేసేదిలేక అంగీకరించాల్సి వచ్చిందని అంటున్నారు. రూ.10 లక్షల్లో రూ.2 లక్షలు షెడ్ నిర్మాణానికి పోను.. మిగతా రూ.8 లక్షలతో గొర్రెల యూనిట్లు ఎంపిక చేసుకోవాలి. 20-1 చొప్పున 20 గొర్రెలు, ఒక పొట్టేలును యూనిట్గా నిర్ణయించారు. ఇక్కడే మధ్యవర్తి కొంతమందితో కలిసి చక్రం తిప్పాడు. ఒక యూనిట్కు రూ.1.05 లక్షల నుంచి రూ.1,15లక్షల వరకు ధర ఉండగా.. ఏకంగా రూ.1.75లక్షల నుంచి రూ.1.90లక్షల వరకు ఉన్నట్టు నమ్మించినట్టు వార్తలు వచ్చాయి. ఇలా ఇక యూనిట్లో ఏకంగా ఒక యూనిట్ వెనుక రూ.80-85 వేలు నొక్కేశారని సమాచారం. ఈ విధంగా ఒక్కో లబ్దిదారు నుంచి రూ.మూడు లక్షల వరకు మింగేశారు. ఇక 550 కిలోమీటర్ల దూరంలో అనంతపురం ఉంటే.. ఏకంగా 800 కిలోమీటర్ల చొప్పున లెక్కగట్టి ఒక్కో యూనిట్కు ట్రావెల్ ఛార్జీల పేరిట రూ.16 వేల వరకు అదనంగా తీసుకున్నారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం నుంచి వచ్చిన జీవాలు ఇక్కడి వాతావరణంలో నిలదొక్కుకోవడం లేదు. ప్రయాణం కష్టాలకే సగం జీవాలు మెత్తబడుతున్నాయి. ఒక్క ఒడ్డెపల్లిలో సుమారు 40 మంది వరకు జీవాలు అప్పగించారు. ఇప్పటివరకు కనీసం పది జీవాలు మృత్యువాతపడ్డాయి. ఇంకా కొన్ని మెత్తబడి ఉన్నాయి. ఎప్పుడు చనిపోతాయో కూడా తెలీదు. మొదటికే మోసం వస్తుందని కొంతమంది బాన్సువాడ సంతలో అమ్ముకున్న పరిస్థితి నెలకొంది. విచిత్రం ఏమిటంటే ఈ జీవాలు చనిపోతుండటంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో లబ్దిదారులు ఉంటే.. వారి నుంచి మళ్లీ ఇవే యూనిట్లను రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు కొనుగోలు చేసి మళ్లీ వాటిని కొత్త యూనిట్లుగా పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా సర్కారు సొమ్మంతా దోచుకుంటున్నారన్న అభిప్రాయాలు అధికారపార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నది. దళితబంధు నుంచి చేస్తున్న జీవాల పంపిణీలో ఉన్న మధ్యవర్తిపై ఇది వరకే కేసులు నమోదయిన్నప్పటికీ.. మళ్లీ ఆయనకే అప్పగించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో ఆ మధ్యవర్తి నుంచి ఎవరెవరికి ఎంతెంత ముట్టాయో దర్యాప్తు జరిగితే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశముంది. ఇదే విషయమై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ను వివరాలు కోరగా.. ఆ వివరాలు తమ వద్ద ఉండబోవని అన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులను అడగాల్సిందిగా చెప్పారు. దాంతో పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారిని వివరణ కోరగా.. వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అసలు లబ్దిదారులకు ఎన్ని యూనిట్లు సరఫరా చేశారు? ఒక్కో యూనిట్కు ఎంత నిధులు విడుదల చేశారు? అన్న వివరాలు లేవు. ఏదో విధంగా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో లబ్దిదారులు వివరాలు బయటకు చెప్పేందుకు భయపడుతున్నారు. మళ్లీ తమను కొత్త సమస్యలు సృష్టిస్తారేమోనని భయపడుతున్నారు.