Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
- పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం : తెలంగాణ వృత్తిదారుల సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి
నవతెలంగాణ - స్టేషన్ఘన్పూర్
మత్స్యకార్మికుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తానని తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తొలిసారిగా మత్స్యకారుల రాష్ట్ర సదస్సు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... 75 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశంలో మత్స్యకారులు చేపల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారన్నారు. అత్యధిక జనాభా కలిగిన మత్స్య కార కుటుంబాలు విద్యా, రాజకీయంగా వెనుకబడి ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టిని పెంచాలనే సదుద్దేశంతో ఉచిత చేప పిల్లలు, వలలు, వాహనాలు, కమ్యూనిటీ భవనాలే కాకుండా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ మార్గదర్శకాలతో కుల వృత్తులకు ప్రోత్సాహమందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ఉచితంగా ఇస్తున్న పథకాలను బంధు చేయాలని బీజేపీ కుట్ర పన్ని, రాష్ట్ర పాలనపై కక్షతో అక్కసు వెళ్లగక్కుతున్నదని విమర్శించారు. గతంలో రైతు నల్లచట్టాలు, నేడు మోటార్లకు మీటర్లు అంటూ రాజ్యాంగ విరుద్ధ పాలన సాగిస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెపుతారన్నారు.
అనంతరం చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. మత్స్యకారుల బతుకులు మారాలంటే ఐక్యంగా ఉండి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సమస్యల్ని పరిష్కరించు కునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం జీఎస్టీ పేరిట పన్నుల్ని పెంచి ఇబ్బందులకు గురి చేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచితాలను తొలగించాలనే కుట్ర పన్నుతున్నారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ కార్యదర్శి లెల్లెల బాలక్రిష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం రూ.83 కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ చేస్తుండగా కాంట్రాకర్ల నిర్వాకంతో అన్యాయం జరుగుతుందని అన్నారు. మత్స్యకారులకు ఎన్సీడీసీ, ఎన్ఎఫ్డీబీల ద్వారా 34 రకాల సంక్షేమ పథకాలు మత్స్యకారులకు అందించి చేయూతనివ్వాలని కోరారు. ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలని తెలిపారు. ప్రతి మత్స్యకార సొసైటీకి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించాలని, 50ఏండ్లు నిండిన ప్రతి మత్స్యకారునికి నెలకు రూ. 5వేలు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. జిల్లా, మండల కేంద్రాల్లో అధునాతనమైన చేపల మార్కెట్ను నిర్మించి, మద్దతు ధర ప్రకటించాలని తెలిపారు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు విన్నవించగా, సానుకూలంగా స్పందించి సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు గొరెంకల నర్సింహ, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, జెడ్పీటీసీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదునూరి వెంకట్రాజ్యం, మాచర్ల గణేష్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష, సహాయ కార్య దర్శులు ముఠా విజరు, తేలు ఇస్తారి, గొడుగు వెంకట్, పగడాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.