Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ప్రోత్సాహంతో మత్స్యరంగం అభివృద్ధి
- ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో మంత్రి తలసాని
నవతెలంగాణ- సిటీబ్యూరో
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రోత్సాహంతో రాష్ట్రంలో మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, అన్ని నీటి వనరుల్లో ఉచిత చేప పిల్లలు వదులుతున్నామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని హరితప్లాజాలో తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహజ నీటి వనరుల్లో (ఇన్ లాండ్) చేపల పెంపకంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి, కులవృత్తులపై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అన్ని నీటి వనరులకు జియో ట్యాగింగ్ చేస్తున్నట్టు చెప్పారు.
ప్రతిఏటా జూన్లో ఫుడ్ ఫెస్టివల్
వచ్చే సంవత్సరం నుంచి ప్రతి యేగా జూన్ 7, 8, 9 తేదీల్లో జిల్లాల్లో మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల వంటకాలను ఫుడ్ ఫెస్టివల్ ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లల ఉత్పత్తిని రాష్ట్రంలోనే చేసుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ కేంద్రాల ద్వారా ఈ సంవత్సరం 10 కోట్ల మేర చేప పిల్లల ఉత్పత్తి చేయడం జరిగిందని తెలిపారు. అన్ని వసతులతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్ను కోహెడ వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్టు చెప్పారు. మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని చెరువులను మత్స్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. వివిధ మత్స్య సొసైటీలు, మత్స్యకారుల మధ్య విభేదాలను పరిష్కరించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 33 జిల్లాలకు మత్స్య సొసైటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్య కారుడికీ సొసైటీలో సభ్యత్వం కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 3.50 లక్షల మంది సభ్యులతో 5 వేల మత్స్య సొసైటీలను ఏర్పాటు చేశామన్నారు.
చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులు ఉన్నాయని, దళారుల పెత్తనాన్ని సహించేది లేదన్నారు. తక్కువ ధరకు చేపలను అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. చేపల విక్రయాల కోసం 100కు పైగా ఫిష్ ఔట్ లెట్ వాహనాలను సబ్సిడీపై అందించినట్టు తెలిపారు. ఒక్కో వాహనం ఖరీదు 10 లక్షల రూపాయలు కాగా, రూ.4 లక్షలకే పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం 6 ఉత్తమ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మంత్రి చేతుల మీదుగా మెమెంటోలను అందజేశారు. 15 నూతన సొసైటీలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పిట్ల రవీందర్, మత్స్యకార జేఏసీ చైర్మెన్ మల్లయ్య, వివిధ జిల్లాల మత్స్యకార సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.