Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్లలో 4,919 మంది విద్యార్థులు లబ్ది
- ఉపకార వేతనాలతో పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆసరా
- ప్రఖ్యాత యూనివర్సిటీల్లో విద్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఈ పథకం అమలయ్యేది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీసీ, ఈబీసీ, మైనారిటీలకు కూడా అమలు చేస్తున్నారు. అగ్రవర్ణ కులాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపచేసింది. గతంలో కేవలం రూ.10 లక్షల రూపాయల గరిష్ట పరిమితి ఉండేది. ఇప్పుడు ఈ పథకం కింద రూ. 20 లక్షల వరకు అందిస్తున్నారు. ఆదాయ పరిమితిని కూడా రూ.4 లక్షల 50 వేలకు పెంచారు. పది శాతం ఓవర్సీస్ స్కాలర్షిపులు హ్యుమానిటీస్, ఎకనామిక్స్, అకౌంట్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రిజర్వ్ చేశారు. ఎనిమిదేండ్లలో 4,919 మంది విద్యార్థులు లబ్దిపొందగా.. వీరి కోసం ప్రభుత్వం రూ.885.99 కోట్లు ఖర్చు చేసింది. లబ్ది పొందిన విద్యార్థుల్లో ఎస్సీ క్యాటగిరిలో 935 మంది, ఎస్టీ 208, బీసీలు 1,603, మైనార్టీ విద్యార్థులు 2,173 మంది ఉన్నారు. ఈ ఉపకార వేతనంతో పేద విద్యార్థులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా తదితర దేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్ డీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇలాంటి పథకమే ఉన్నా.. వంద మందిలోపే విద్యార్థులు ఎంపికయ్యేవారు. స్కాలర్షిప్ రూ.5 లక్షలు కూడా ఉండేది కాదు. ఇప్పుడు రూ.20 లక్షలు కేటాయిస్తున్నారని పౌరసంబంధాల శాఖ కమిషనర్ అర్వంద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.