Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణాలైనా ఇస్తాం.. స్థలాలు వదులుకోం
- పేదల భూములపై దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదు
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఫిలింసిటీలో నిరసన వ్యక్తం చేసిన బాధితులు
- సర్కారు భూములు పేదలకు చెందాల్సిందే
- పేద ఇంటి జాగాలు దక్కేవరకు పోరు ఆగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వెస్లీ
- కబ్జా చేసిన భూములను లాక్కొన్ని.. పేదలకు పంపిణీ చేయాలి : సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పేదలకు చెందాల్సిన సర్కారు భూములను పెట్టుబడిదారులకు దారదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, రామోజీరావు లాంటి ఎంత మంది బడాబాబులు వచ్చినా ఈ జాగాలు పేదలకు దక్కేవరకు పోరాడుతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వెస్లీ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్పల్లి, పొల్కంపల్లి, రాయపోల్ గ్రామాలకు చెందిన ఇండ్లు లేని నిరుపేదల కోసం 2007లో నాగన్పల్లి రెవెన్యూ పరిధిలో 189, 203 సర్వే నెంబర్లో సుమారు 20 ఎకరాల్లో 600 మంది పేదలకు అప్పటి ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. ఈ ఇంటి జాగాలను పేదలకు ఇవ్వాలని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు సుమారు 800 మందితో బుధవారం రామోజీ ఫిలిం సిటీలో పేదలకు కేటాయించిన భూముల్లో నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు నాగన్పల్లి గ్రామ శివారు నుంచి ఫిలింసిటీ వరకు పెద్ద ఎత్తున ఎర్రజెండాలు చేబుని, నినాదాలు చేస్తూ.. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రామోజీ రావు కాజేయాలని చూస్తున్న పేదల జాగాలను రక్షించాలి, పేదలకు ఇండ్ల జాగాలు ఇవ్వాలని నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలోకి రాకుండా అడ్డంగా గేట్లు పెట్టడం.. గోడలు నిర్మించడానికి ఈ జాగాలు రామోజీ రావు సొత్తుకాదని హెచ్చరించారు. పేదల భూములను కాజేయాలని చూస్తే ఎంతటి వారినైనా తరిమికొట్టే దమ్ము ఎర్రజెండాకు ఉందన్నారు. పేదల ఇంటి స్థలాల కోసం నాటి ప్రభుత్వాలు కేటాయించిన జాగాలను.. తాము చూసుకోవడానికి వస్తే పోలీసుల అడ్డగింతలు, రెవెన్యూ అధికారుల హెచ్చరికలు వస్తున్నాయని అన్నారు. రెవెన్యూ సర్వే నక్షలో ఉన్న రోడ్డును కబ్జాపెట్టిన రామోజీ రావును ఎందుకు హెచ్చరించడం లేదని ప్రశ్నించారని, కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రామోజీ రావు, సీఎం కేసీఆర్ ఎవరు అడ్డు వచ్చిన పేదల ఇంటి జాగాల కోసం కేటాయించిన భూముల్లో ఇండ్లు నిర్మించి తీరుతామని తెలిపారు. పేదలకు చెందాల్సిన ఇంటి జాగాలపై సీఎం కేసీఆర్ స్పందించి తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం వచ్చే వరకు పోరు ఆగదన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికి ఇంటి జాగాలు ఇవ్వాలన్నారు.
సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్ మాట్లాడుతూ.. పేదల ఇంటి నిర్మాణాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం కాజేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ భూముల కబ్జాకోరులో మొదటి స్థానంలో ఉన్న రామోజీ రావు.. చివరికి పూటగడవని కడుపేద ప్రజల ఇంటి జాగాలను వదలకుండా స్వాధీనం చేసుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఫిలింసిటీ నడ్డిబొడ్డున ఉన్న భూములను పేదలకు దక్కొద్దన్న దురుద్దేశంతో రామోజీ రావు రెవెన్యూ యంత్రాంగాన్ని తమ గుప్పొట్లోకి తీసుకుని కుట్రలు చేస్తున్నారన్నారు. రామోజీరావుకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం తమ హక్కసును పేదలపై చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామేల్, పగడాల యాదయ్య, జగదీశ్, జిల్లా కమిటీ సభ్యులు జంగయ్య, జగన్, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.
''వేల ఎకరాలు ఉన్న గీ పెద్దోల్లోకు.. పూట గడవని.. తలదాచుకోవడానికి గూడు గతిలేని మా పేదల ఇంటి జాగాలను కబ్జాపెట్టేందుకు మనసు ఎట్లోప్పుతుందో..? సర్కారు ఇచ్చిన జాగాలో ఇల్లు కట్టుకుందామంటే.. రాబందుల రామోజీ మా భూములపై వాలిపోయి. బునాధి కూడా తియ్యనియ్యకపాయే. నాటి నుంచి నేటి వరకు జాగా కోసం పడని తిప్పలు లేవు. ఇగోచ్చే.. అగోచ్చే అని ఓపికగా ఎదురుచూసినం.. కానీ గీప్పుడు ఊరుకునేది లేదు. వస్తే జాగాలు రావాలి.. పోతే ప్రాణాలు పోవాలి తప్ప పోరులో వెనకడుగు వేసేది లేదని'' బాధితులు స్పష్టం చేశారు.