Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలను గాలికొదిలేసిన బీజేపీ సర్కారు
- రైతు సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి : సీపీఐ(ఎం) నియోజకవర్గ సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
దేశం మొత్తంలో బీజేపీ ప్రభుత్వమే ఉండేలా మోడీ కుట్ర చేస్తున్నారని, అరాచక పాలన సాగిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో నిర్వహించిన సీపీఐ(ఎం) నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ, అమిత్షా ఇద్దరూ డబుల్ ఇంజిన్ పాలన పేరుతో మతపరమైన విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్లతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని చెప్పారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ దాడులకు పాల్పడు తున్నారన్నారు. అందులో భాగంగానే మంత్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయని, గతంలో జరిగిన రైతు ఉద్యమమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈనెల 27న నల్లగొండలో జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభ నేపథ్యంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తామని, రైతులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, డాక్టర్ మల్లు గౌతమ్రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, వరలక్మి, పరశురాములు, సీతారాములు, భవాండ్ల పాండు, శశిథర్ రెడ్డి, వినోద్నాయక్, రొండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.