Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి వేముల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లకు మౌళిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ పేదల సొంతింటి కలను నెరవేర్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ ప్రగతి, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వివరాలపై బుధవారం హైదరాబాద్లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఇతర రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులు పాల్గొన్నారు. రెండు పడకల గృహ నిర్మాణ పథకంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,91,057 ఇండ్లు రూ.19,328.32 కోట్ల అంచనా వ్యయంతో అనుమతి ఇచ్చామని తెలిపారు. 2,28,529 గృహాలకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. నిర్మాణం ప్రారంభించిన 2,28,529 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకుగానూ 1,29,528 గృహాలు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలిపారు. మిగతా 58,350 గృహాల నిర్మాణం తుది దశలో ఉన్నదని పేర్కొన్నారు. మిగతా 40,651 ఇండ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తి అయినవి, నిర్మాణతుది దశలో ఉన్న ఇండ్లకు మౌలిక సదుపాయాలు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా త్వరగా పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులకు ఇండ్లు అప్పగించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.