Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్దిదారుల ఎంపికను జనవరి 15 లోపు పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. వాటి నిర్మాణ పనుల పురోగతి, లబ్దిదారుల ఎంపిక తదితర అంశాలపై గురువారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ సునీల్ శర్మతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. మంత్రి వేముల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు అందేలా చూడాలని కోరారు. బీపీఎల్ కుటుంబాలు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, అద్దె ఇండ్లలో ఉన్న వారి జాబితాను ఎంపిక చేసి గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని సూచించారు. తుది జాబితాను సంబంధిత ప్రజాప్రతినిధుల ఆమోదంతో హైదరాబాద్లోని టీఎస్టీఎస్కు పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్తోసహా రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల 91 వేల డబుల్బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను చేపట్టాలని వివరించారు. హైదరాబాద్ మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షా 29 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాలైన విద్యుత్, సీవరేజ్, రహదారుల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు. ఇండ్లను లబ్దిదారులకు కేటాయించడంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. తుది దశలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు.