Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని రంగాల్లోనూ ముందు ఉండేలా ప్రణాళిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నది. ముస్లిం మైనార్టీల జీవితాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం ఆచరణాత్మక విధానాన్ని అమలు చేస్తున్నది. 2022-23 బడ్జెట్లో మైనార్టీల సంక్షేమం కోసం రూ.1724.696 కోట్లు కేటాయించింది. ఇతర వర్గాలతో సమానంగా వారికి సముచితమైన వాటా దక్కేలా చూస్తున్నది. వారి సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా మైనార్టీల కోసం షాదీ ముబారక్ను అమలు చేస్తున్నది. ఇప్పటి వరకు 2014 -15 నుంచి ఇప్పటి వరకు 2,28,200 మందికి ఆర్థిక సహాయం అందించింది. ఆ పథకం ద్వారా ఒక్కొకరికి రూ.1,00,116ల ఆర్థిక సహాయం అందుతున్నది. పేద మైనార్టీలకు ఎంతో మేలు చేకూరుతున్నది. 2014-15 నుంచి 2022-23 వరకు రూ.2165 కోట్లు ఈ పథకానికి కేటాయించింది. రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యలో భాగంగా మైనార్టీలను ఉచిత విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించాలని 204 మైనార్టీల రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించడంతోపాటు జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. విద్యాసంస్థల్లో 1,30,560 మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కొక్క సంస్థలో 640 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతున్నది. 107బాలురు, 97 బాలికలకు సంబంధించిన విద్యాలయాలున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించి వారికి విలువతో కూడుకున్న పరిజ్ఞానం అందిస్తున్నది. మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సీఎం ఓవర్ సీస్ స్కాలర్షిప్ పథకాన్ని 2015-2016లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఇప్పటివరకు 2725 మంది ఎంపికయ్యారు. 436 కోట్ల ఆర్థికసహాయం అందించింది. ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. 2022-23 బడ్జెట్లో 100 కోట్లు కేటాయించింది. వారికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్లో రూ.40 కోట్లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.150 కోట్లు కేటాయించింది. 66 మంది ఉర్దూ ట్రాన్స్లెటర్లను నియమించింది. ఫకీర్ కమ్యునిటీ వారి సంక్షేమం కోసం 110 మోపెడ్లను పంపిణీ చేసింది. రంజాన్ సందర్భంగా గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ, ప్రతినెలా ఇమామ్లకు రూ. 10 వేలు , మౌజమ్లకు రూ. 5వేల గౌరవవేతనం, 100 మంది మైనార్టీ విద్యార్థులకు ఐఏఎస్ కోచింగ్, మక్కా మసీదు రిపేర్లకు రూ.8.48 కోట్లు, అనీసుల్ గుర్బాకు రూ. 39 కోట్లు, జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి 50 కోట్లు, జామియా, నిజామియా ఆడిటోరియానికి రూ.14.65 కోట్లు, ఇస్లామిక్ ఏఎంపీ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ కోసం రూ.40 కోట్లు కేటాయించింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో, డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం, కుట్టు మిషన్ల పంపిణీ, సబ్సిడీతో కూడిన బ్యాంక్ రుణాలు, స్కిల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.