Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తాం
- పంటల విధానంలో మార్పులు చేయాలి
- రైతు బీమా ఏజ్లిమిట్ మార్చాలి
- కౌలు, పోడు రైతులకు హక్కులు రావాలి
- మహాసభల్లో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం
'దేశాన్ని రక్షించుకుందాం...రైతాంగాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ చెప్పారు. వ్యవసాయం, రైతు సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఐక్యపోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. పంటల సాగు విధానంలో చాలా వ్యత్యాసం ఉందన్నారు. దీంతో వరి, పత్తి తప్ప మిగతా పంటలకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. రైతు బంధు, రైతు బీమా అమలు చేయడం వెనక రైతు సంఘం ఒత్తిడి ఉందన్నారు. రైతు బీమా పథకంలో ఏజ్లిమిట్ (18 నుంచి 58 ) మార్చాలనీ, తద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించాలని కోరారు. కౌలు, పోడు రైతుల హక్కులతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆది, సోమ, మంగళవారాల్లో నల్లగొండ పట్టణంలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని నవతెలంగాణ ప్రతినిధి గుడిగ రఘుతో సాగర్ ప్రత్యేకంగా మాట్లాడారు.
మహాసభల ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది?
తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంటల కొనుగోళ్లు, మద్దతు ధరల సమస్య, ధరణి పోర్టల్తో రైతులకు కొత్త చిక్కులు, కౌలు రైతులు, పోడు సమస్య... ఇలా చెప్పుకుంటూపోతే అన్నదాతలు ఎన్నో సమస్యలతో అవస్థలు పడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మరిన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. వీటన్నింటిపై మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం. మద్దతు ధరలకు అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరమున్నది.
భూనిర్వాసితులకు ఇప్పటికీ సాయం ఉందా?
రాష్ట్రంలో దశాబ్దాలుగా భూనిర్వాసితుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం, ఓఆర్ఆర్, జాతీయ రహదారులు, ఫార్మా, నిమ్జ్ తదితర ప్రాజెక్టుల్లో ఎంతో మంది రైతులు తమ భూములను కోల్పోయారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం ఇవ్వాలి. కానీ ఎక్కడా అమలు చేయడంలేదు. చట్టం తో సంబంధం లేకుండా పాలకులు నిర్వాసితులతో బేరసారాలు చేస్తున్నారు. పరిహారం విషయంలో ఆరు లక్షలు ఇస్తున్నారు. భూ నిర్వాసితులు న్యాయమైన డిమాండ్ సాధించాల్సి ఉన్నది. శాశ్వతంగా భూములు కోల్పోతారు. నిర్వాసితుల నష్టం తక్కువగా ప్రాజెక్టుల డిజైన్ మార్చాలని అడిగాం. అయితే ఎక్కడా అమలు చేయలేదు. వారికి న్యాయమైన పరిహారం అందేలా ఉద్యమిస్తాం.
తెలంగాణ రైతు సంఘం నిర్వహించిన పోరాటాలేంటి? సాధించిన ఫలితాలేంటిి?
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతంగా జరిగాయి. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి నష్టపరిహారం అందించాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపట్టాం. ఆయా కుటుంబాల తో ఢిల్లీలో ధర్నాలు నిర్వహించాం. గతంలో ఎక్స్గ్రేషియా లక్షన్నర ఉండేది. మా పోరాట ఫలితంగా ఆరు లక్షలు ఇస్తున్నారు. రైతు కుటుంబా లకు రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను ప్రకటించింది. రైతు బీమా కోసం 18 నుంచి 58 వయస్సు నిబంధనను మార్చాలి. అది మంచి స్కీమ్. వ్యవసాయ శాఖ నేరుగా రైతు బీమా ఇవ్వాలి. తద్వారా 25లక్షల కుటుంబాలకు అదనంగా ప్రయో జనం కలుగుతుంది. ఐదెకరాల లోపు రైతులకు పెట్టుబడి సాయం కోరాం. అనేక దేశాల్లో ఇస్తున్నారు. 13 లక్షల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు. వారికి పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో జరుగుతున్న మహాసభకు 32 జిల్లాల నుంచి వెయ్యి మంది ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరు అవుతు న్నారు. ఆదివారం జరగనున్న మహాప్రదర్శనలో 50వేల మంది రైతులు పాల్గొంటున్నారు.
అసైన్డ్ భూముల శాశ్వత పట్టాల సమస్య ఏంటి?
అత్యంత నిరుపేదలకు అసైన్డ్ భూములిచ్చారు. వాటిని అమ్మకాలు, కొనుగోలు చేసేందుకు వీలులేదు. పట్టాదారులతోపాటు నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి. డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతివనాలు, శ్మశాన వాటికల కోసం పేదల భూములను తీసుకున్నారు. వారికి ఏ రకమైన పరిహారం ఇవ్వలేదు. పట్టా భూమితో సమానంగా వారికి పరిహారం ఇవ్వాలి. సాగు నీటి వనరులు పెరిగాయి. సకాలంలో వానలు కురిశాయి. ఉచిత కరెంట్, బోర్లు తదితర కారణాలతో వడ్ల ఉత్పత్తి పెరిగింది. కొత్త ప్రాజెక్టుల కింద పంటలు బాగా పండుతున్నాయి. దాన్ని అంగీకరించాల్సిందే.
విద్యుత్ సవరణ బిల్లుతో రైతులకు కలిగే ఇబ్బందులేంటి?
విద్యుత్ సవరణ బిల్లుతో కేవలం రైతులకే కాదు యావత్ ప్రజానీకానికీ నష్టమే. విద్యుత్ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడంలో భాగంగానే ఈ చట్టం వచ్చింది. విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలి. సోలార్, హైడల్, గాలి, థర్మల్ ప్రయివేటీకరణ అవుతాయి. ట్రాన్స్మిషన్ ప్రయివేటీకరణ అయితే రైతులపై తీవ్రమైన భారం పడుతుంది. రీచార్జ్ లేకపోతే సెల్ఫోన్లు ఆగిపోయినట్టు మోటార్లు ఆగిపోతాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో రైతులకు అన్యాయం చేస్తున్నది. పీఎం సమ్మాన్ నిధి లబ్దిదారులను 11 కోట్ల లబ్దిదారుల నుంచి మూడున్నర కోట్లకు కుదించారు. రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చదు. ఇత్యాధి విషయాలపై మహాసభల్లో చర్చిస్తాం.