Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతలు ఏకమైతే బీజేపీ సర్కార్ పతనమే..
- సంపద సృష్టించేది రైతులు, కౌలు రైతులే : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలో ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్
నవతెలంగాణ-నల్లగొండ
పారిశ్రామికవేత్తలకు, పెట్టు బడిదారీ వర్గాలకు, కార్పొరేట్లకు, భూస్వాములకు లబ్ది చేకూర్చే విధానాలను అనుసరిస్తూ.. రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రధాని మోడీ ధ్వంసం చేస్తున్నారని ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్ విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్లో మల్లు స్వరాజ్యంనగర్, మాలి పురుషోత్తంరెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ రెండో రోజు సోమవారం కొనసాగింది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జెండాను ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి రైతు సంఘం నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మహాసభకు వివిధ జిల్లాల నుంచి 800 మంది రైతు నాయకులు హజరయ్యారు.
అనంతరం మహాసభలో డాక్టర్ విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం శ్రామిక ప్రజలకు, ముఖ్యంగా రైతు, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకం గా పనిచేస్తున్నదన్నారు. 'అచ్ఛేదిన్' నినాదంతో ప్రజలను మోసగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రయివేటీకరణ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి నష్టపరిహారాన్ని అంచనా వేసి చెల్లించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైతు బీమాలో 18-59 సంవత్సరాల వయసు రైతులకే బీమా ప్రీమియం చెస్తుందని.. అలా కాకుండా దాన్ని 70 ఏండ్ల వయస్సు వరకు పెంచాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అమలు జరపాలని కోరారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. రైతు రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను రైతులుగా గుర్తించాలని కోరారు.
అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు రుణమాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టించే రైతులు, కౌలు రైతులను విస్మరించి దేశ సంపదను కొల్లగొట్టే వారికి మోడీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసి పారిశ్రామికవేత్తలకు దోచిపెడు తుండటంతో ప్రజలంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంపై రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, అనుబంధ రంగాలకు చెరదిన చిన్న వ్యాపారులు ఎంతోమంది ఆధారపడి ఉన్నారన్నారు. ఈ రంగం సంక్షోభంలోకి వెళ్లడం వల్ల మెజార్టీ ప్రజలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేద్యంలో కీలకంగా ఉన్న కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించక పోవడం దారుణమన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతులకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే లక్షన్నర మందికి కూడా సీసీఆర్సీలు ఇవ్వడం లేదని తెలిపారు. కౌలు రైతుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని, రుణ విముక్తి చట్టం, సమగ్ర వ్యవసాయం చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని కోరారు.
వ్యవసాయ శాఖ ద్వారా కౌలు రైతుల గుర్తింపు జరగాలని, ఇందుకోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దులో 13 నెలలపాటు జరిగిన రైతాంగ ఉద్యమం స్ఫూర్తిగా రాష్ట్రంలో కౌలు రైతులు ఉద్యమించాలని సూచించారు. భూయజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతాంగ సమస్యలపై మరో పోరాటానికి సిద్ధం
వ్యవసాయ రంగం కరువుకాటకాలతో అల్లాడు తోందని, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులు మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలం గాణ రైతు సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అవలంబిస్తున్న విధానాల వల్ల రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలో లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కనిపించకపోవడంతో రైతుల ఆదాయం పూర్తిగా దిగజారి పోయిందన్నారు. స్వామి నాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పోరాట చరిత్రలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటికీ అనేక గుణపాఠాలు నేర్పుతుందన్నారు. మోడీ పభుత్వం ఎరువుల సబ్సిడీని రద్దు చేయాలని, సీసీఐని ఎత్తేయాలని యత్నిస్తోందని, దాన్ని అడ్డుకోవడానికి బలమైన పోరాటాలు చేయాల్సి ఉందని చెప్పారు.
మహాసభకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, రైతు మహిళా రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి, శెట్టి వెంకన్న, వల్లపు వెంకటేష్, అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జాతీయ నాయకులు హన్నన్ మొల్ల, సారంపల్లి మల్లారెడ్డి, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు- నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, బండ శ్రీశైలం, సహాయ కార్యదర్శి మూడు శోభన్, మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి