Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుకు రావాలంటూ విజ్ఞప్తి
- ఢిల్లీలో సీఐఐ, ఎస్ఐడీఎమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రాంతమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. సోమవారం ఢిల్లీలో సీఐఐ, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ(ఎస్ఐడీఎమ్) ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఈకో సిస్టం కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటనీ, ఏడేండ్లలో ఆ వ్యవస్థ భారీగా విస్తరించిందని తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్థానికంగా సుమారు 1000కి పైగా ఎమ్ఎస్ఎమ్ఈ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న డిఫెన్స్ పరిశోధన, అభివృద్ధి రంగం అత్యంత కీలకమైనదని తెలిపారు. డీఆర్డీఓ, బెల్, హాల్ వంటి అనేక ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలుండటంతో హైదరాబాద్ నగరానికి మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొచ్చిందని వివరించారు. దీంతో పాటు ఏరోస్పేస్, పలు దేశాల డిఫెన్స్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టీఎస్ఐపాస్ విధానం, హైదరాబాద్ నగరంలోని ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, కోతలులేని 24 గంటల పారిశ్రామిక విద్యుత్ సదుపాయం వంటి అంశాలను తమ పెట్టుబడి ప్రణాళికల్లో పరిగణలోకి తీసుకోవాలని డిఫెన్స్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ప్రయివేటు సంస్థలకు అవసరమైన మానవ వనరుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదనీ, దీంతోపాటు ప్రపంచ స్థాయి క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి వాటితో సైతం తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకున్నదని వివరించారు. బోయింగ్ కంపెనీ ఇన్నోవేషన్ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐడీఈఎక్స్ వంటి ఇంకుబేషన్ కార్యక్రమాలను సైతం చేపడుతున్న విషయాన్ని తెలిపారు. ఆదిభట్ల, నాదర్గుల్, జీఎంఆర్ ఏరోస్పేస్, హార్డ్వేర్ పార్క్, ఈ-సిటీ, ఇబ్రహీంపట్నంలో టీఎస్ ఐఐసి ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్క్ వంటి ప్రత్యేకమైన ఏరోస్పేస్ డిఫెన్స్ ఇండిస్టీయల్ పార్కులు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఓఎస్డిగా ఉన్న సీనియర్ అధికారి సంజరు జాజు, తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఏరో స్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.