Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామూహిక లైంగికదాడికి పాల్పడి వీడియో చిత్రీకరణ
- ఆగస్టులో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి..
- ఐదుగురు మైనర్లు అరెస్ట్, మూడు ఫోన్లు స్వాధీనం
- అత్యాచార ఘటన వీడియో వాట్సాప్లో వైరల్
నవతెలంగాణ-హయత్ నగర్
పదో చదువుతున్న బాలికపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ నగర శివారులోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆగస్టులో జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్నగర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై 9,10వ తరగతి చదివే విద్యార్థులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని వీడియో తీశారు. విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అనంతరం 10రోజుల తర్వాత కూడా బాలికపై వారు లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే, అప్పటి వీడియోను నిందితులు తాజాగా సోషల్మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ స్థానిక కౌన్సిలర్ దృష్టికి రావడంతో వెంటనే వారు పోలీసులకు తెలియజేశారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని జువైనల్ హౌమ్కు తరలించారు.