Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.121 కోట్లు
- 1,200 స్కూళ్లలో మన ఊరు-మనబడి నిర్మాణ పనులు పూర్తి : విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బడుల పున: ప్రారంభ సమయంలోనే ఏకరూప దుస్తులను అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలంటూ విద్యాశాఖ అధికారులను రాష్ట్ర మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో ఏకరూప దుస్తుల పంపిణీ, మన ఊరు - మన బడి కార్యక్రమంపై మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఏకరూప దుస్తులను ధరించి తరగతులకు హాజరైతే వారిలో క్రమశిక్షణ ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 25 లక్షల మంది విద్యార్థులకు రూ.121 కోట్లతో ఏకరూప దుస్తులను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులందరూ ఒకే రకమైన దుస్తులు ధరించడం ద్వారా వారి మధ్య తారతమ్యాలు, ఎలాంటి కల్మషాలకు తావు లేకుండా ఉండే అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా స్థాయిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో మొదటి దశలో చేపట్టిన పాఠశాలల్లో 1,200 స్కూళ్లలో నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. వాటిలో సీసీ కెమెరాలు, ఫర్నీచర్, ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలను వచ్చేనెల 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మిగతా పాఠశాలల్లో కూడా పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.