Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన
- సన్నాహక ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ వల్ల లక్షలాది మందికి లబ్ది చేకూరుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ, మెట్రో రైల్, పురపాలక, ఎయిర్పోర్ట్ అధికారులతో ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఎయిర్పోర్టు వరకు మెట్రో కారిడార్ దోహదపడు తుందని తెలిపారు. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ది చేకూరుతుందని చెప్పారు. ఈ కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన చేసే ప్రాంతంతోపాటు సీఎం కేసీఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లను ఒకటి రెండ్రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికలపై కసరత్తు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని మంత్రి అన్నారు. మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కావడం వల్ల ఎమ్మెల్యేలందరూ కార్యక్రమ నిర్వహణలో భాగస్వా ములు కావాలని సూచించారు. ఇందుకోసం నగర ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మంత్రులకు చెప్పారు.