Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ధీశాలి : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్త్రీకి స్వేచ్ఛ కరువైన కాలంలో ఈశ్వరీబాయి ఒక దళిత మహిళగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉన్నత శిఖరాలకు చేరారనీ, ఆమె జీవితం మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం ఈ శ్వరీబాయి జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఆమె అని కొనియాడారు. రాజకీయ నాయకురాలిగా, సామాజికవేత్తగా, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారిణిగా ఈశ్వరీబాయి సాగించిన సాహస పోరాటాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ గర్వించే బిడ్డగా ఈశ్వరీబాయి విలువలను రేపటితరానికి అందించాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈశ్వరీబాయి వంటి ప్రజాస్వామిక వాదుల ఆశయాల ప్రేరణతో రాష్ట్ర ప్రభుత్వం దళిత సాధికారతను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని పునరుద్ఘాటించారు. ఆమె స్ఫూర్తితోనే అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. దళితుల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేయడం కోసం, వారి ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించటం కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దళిత బహుజన, మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను కొనసాగించాలనే స్పృహను యావత్ దేశంలోని పాలక వ్యవస్థకు కలిగించేందుకే తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామనీ, 125 అడుగులతో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.