Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు, చట్టాల కోసం పోరాటాలు
- కార్మికులతో వెట్టి చేయిస్తున్న పాలకులు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులు, మోడీ, అమిత్షా లాంటి ప్రభుత్వ శక్తులు కలిసి దోచుకోవడమే డబుల్ ఇంజన్ సర్కార్ ఉద్దేశమని, ఈ రెండు శక్తులు కలిసి దేశాన్ని సర్వ నాశనం చేస్తూ... ఒకే జెండా, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే చట్టం, ఒకే మతం.. అంటూ బీజేపీ దేశం మీదపడి కాలకేయుళ్లా దాడి చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్ (సున్నం రాజయ్య నగర్) లో జరిగిన తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయూస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రథమ మహాసభకు ఆయన హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ముందుగా సంఘం జెండాను యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జంజిరాల శ్రీనివాస్ ఎగరవేశారు. అనంతరం జరిగిన సభలో జూలకంటి మాట్లాడుతూ.. అందరి కంటే ఎక్కువ కష్టపడి సంపదను సృష్టిస్తున్న రైతులు, కార్మికులు ఎక్కువ పేదరికాన్ని అనుభవిస్తుంటే, ఏ కష్టమూ చేయని కార్పొరేట్ శక్తులు మాత్రం దేశ సంపదనంతా దోచుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా మోడీ అమలు చేయలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని యువతను మోసం చేశారని, నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న మాట నీటి మూటైందన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం.. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. నల్ల చట్టాలను రైతులు పోరాడి వెనక్కు కొట్టినట్లుగానే కార్మికులు కూడా సంఘటితంగా పోరాడి లేబర్ కోడ్లను తిప్పికొట్టాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో రూ.36 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మిషన్ భగీరథ పథకంలో 15 వేల మంది కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు కూడా అంతే గొప్పగా ఉండే విధంగా వారికి కనీస వేతనాలివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వాలు వేసిన కమిటీలే ఒక కుటుంబం గడవడానికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం సరైంది కాదని చెప్పారు. రోజుకు 12 గంటల పాటు దూర ప్రాంతాలకెళ్లి పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరేడు వేల జీతమిచ్చి కంపెనీలు దోపిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు కంపెనీలు ఇష్టమొచ్చిన రీతిన వేతనాలిచ్చి కార్మికుల్ని దోచుకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమే అవుతుందన్నారు. చట్టబద్దమైన సదుపాయాలు, కనీస వేతనాల కోసం కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలన్నారు. కార్మికుల పక్షాన ఎర్రజెండా, సీఐటీయూ జెండా ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మోడీ ప్రభుత్వం కాలరాస్తూ 12 గంటల పనివిధానాన్ని తెస్తుందని విమర్శించారు. లేబర్ కోడ్ల వల్ల కంపెనీలు, కార్పొరేట్ శక్తులకు మేలు చేకూరుతుందన్నారు. కార్మికులకు కనీసం యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా మోడీ ప్రభుత్వం చేస్తున్నాదన్నారు. సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించి కార్మిక చట్టాలను కాపాడుకోవాలన్నారు. సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ కార్మికులది 'ఎక్కువ కష్టం తక్కువ జీతం' అన్నారు. మెగా, రాఘవ, కేఎల్ఎస్ఆర్ వంటి కాంట్రాక్టు కంపెనీలు భగీరథ కార్మికులతో 12 గంటల పాటు పనిచేయిస్తూ రూ.8 వేలకు మించి జీతాలివ్వట్లేదన్నారు. మహాసభలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జంజిరాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు సుధాకర్, వెంకన్న, రాములు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.