Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు 8074827875, 7382619363
- త్వరలో కొత్త ఎకో టూరిజం పాలసీ
- అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలోని ఎకో టూరిజం పున:ప్రారంభించినట్టు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం.డోబ్రియల్, ములుగు జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్ వెల్లడించారు. వివరాల కోసం 8074827875(లక్నవరం), 7382619363(తాడ్వాయి) నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. తెలంగాణ అటవీ ప్రాంతాల్లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయనీ, వాటి సందర్శనకు వీలుగా తగిన కొత్త ఎకో టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతున్నదనీ, ప్రభుత్వ అనుమతితో త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డోబ్రియల్ వెల్లడించారు. అటవీ అందాల వీక్షణ, పర్యావరణ స్పృహ పెరిగేలా కార్యక్రమాల రూపకల్పన, బాధ్యతాయుత పర్యావరణ పర్యాటకానికి అటవీ శాఖ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. అటవీ ప్రాంతాలను ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామనీ, సందర్శకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. రెండేండ్ల నుంచి కరోనా నేపథ్యంలో ఎకో టూరిజాన్ని అటవీశాఖ నిలిపివేసిన విషయం తెలిసిందే.
తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించే పర్యాటక ప్రాంతాల్లో లక్నవరం, బొగత జలపాతం ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సుమారు 250 కిలో మీటర్ల దూరం, ఐదున్నర గంటల ప్రయాణంతో ఏటూరు నాగారం అభయారణ్యానికి చేరుకోవచ్చు. రాత్రి బసకు లక్నవరం దగ్గర టూరిజం హౌటళ్లతో పాటు, తాడ్వాయిలో అటవీశాఖ హట్స్ అందుబాటులో ఉన్నాయి. లక్నవరం, తాడ్వాయి, బొగత చుట్టు పక్కల ప్రాంతాలను కలిపి రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం (బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకం) సర్క్యూట్ ను అటవీ శాఖ అభివృద్ధి చేస్తోంది. ఒక గంటకు వంద రూపాయలు చెల్లించి సైక్లింగ్ అనుభూతిని ఇక్కడ పొందవచ్చు. దారిలో లక్నవరం అలుగు, తూములు, వాచ్ టవర్ నుంచి బర్డ్ వాచింగ్, అటవీ, సరస్సు అందాలను వీక్షించవచ్చు. అటవీశాఖ ద్వారా గైడ్ కూడా అందుబాటులో ఉంటారు. గడ్డి మైదానాల పెంపు (గ్రాస్ లాండ్స్), సోలార్ బోర్ వెల్స్, నీటి యాజమాన్య పద్ధతులు (పర్కులేషన్ ట్యాంక్స్) స్థానిక అటవీ అధికారులు వివరిస్తారు. తాడ్వాయి సమీపంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ (రివర్ ఐలాండ్), డోల్మెన్ సమాధులు (పురాతన రాకాసి గుహలు)ను కూడా సందర్శించవచ్చు. లక్నవరం సమీపంలో ఒక రాత్రి టెంట్ లో బసచేసేలా మొత్తం 24 గంటలు ప్యాకేజీ త్వరలో అందుబాటులోకి రానుంది. తాడ్వాయి హట్స్ నుంచి సఫారి వాహనంలో 20 కిలో మీటర్లు ఐలాపూర్ వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరించే అవకాశముంది. అటవీశాఖ తరపున సఫారీ వాహనం అందుబాటులో ఉంటుంది.