Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11,12,14,15 తేదీల్లో అందుబాటులో ఉంటా...
- ఎఫ్ఆర్ఐలో నా పేరు లేదు
- సీబీఐకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల మంగళవారం సీబీఐ చేపట్టాలనుకున్న విచారణకు తాను హాజరు కాలేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. 'ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు (సీబీఐకి) అనువుగా ఉన్న ఏదైనా ఒకరోజు హైదరాబాద్లోని నా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటా...' అని ఆమె స్పష్టం చేశారు. ఆ తేదీని త్వరగా ఖరారు చేయాలంటూ కోరారు. ఈ మేరకు సీబీఐకి ఆమె లేఖ రాశారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ తన వెబ్సెట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్నంగా పరిశీలించానని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందులోని నిందితుల జాబితాను కూడా చూశానని వివరించారు. ఆ జాబితాలో తన పేరు ఎక్కడా లేదంటూ గుర్తు చేశారు. ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులపై ఆమె స్పందించిన విషయం తెలిసిందే. ఫిర్యాదు కాపీతోపాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి కవిత లేఖ రాసిన విషయం విదితమే. స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉందంటూ తెలిపారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించానని ఆమె వివరించారు. అందులో తన పేరు ఎక్కడా లేదని పేర్కొంటూ సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిననీ, దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపారు. అందుకనుగుణంగా 11,12,14,15 తేదీల్లో ఏదో ఒకరోజు సీబీఐ అధికారులతో సమావేశమవుతానని స్పష్టం చేశారు.