Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1,419 మంది అమ్మాయిలను కాపాడిన పోలీసులు
- 17 మంది ముఠా అరెస్ట్
- 39 కేసుల్లో నిందితులకు ప్రమేయం
- హ్యూమన్ ట్రాఫికింగ్లో ఆర్నావ్ కీలక నిందితుడు
- సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
నవతెలంగాణ-మియాపూర్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హ్యూమన్ ట్రాఫికింగ్ సెక్స్ రాకెట్ ముఠాను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మొత్తం 17 మందితో కూడిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సైబరాబాద్ సీపీ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. 17 మందితో కూడిన సెక్స్ రాకెట్ ముఠాగా ఏర్పడి దేశంలోని 15 సిటీల నుంచి యువతులను రప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారు. వెబ్సైట్, వాట్సాప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి, వారి వద్దకు అమ్మాయిలను పంపిస్తున్నారు. 39 కేసుల్లో ఈ నిందితులకు ప్రమేయం ఉంది. 1,419 మంది అమ్మాయిలు వ్యభిచార ముఠాలో చిక్కుకున్నట్టు గుర్తించారు. సెక్స్ రాకెట్స్తో పాటు డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ కస్టమర్లకు ఎర వేస్తున్నారు. ఇప్పటికే సైబరాబాద్లో ఐదు కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్టు సీపీ తెలిపారు. సరఫరాదారులు, బ్రోకర్లు ద్వారా బాధిత మహిళలను కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని చెప్పారు. విమానాల్లో కూడా అమ్మాయిలను ఇతర రాష్ట్రాల కస్టమర్ల దగ్గరకు పంపుతున్నట్టు విచారణలో వెల్లడైంది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, ముంబై, కోల్కతకు చెందిన వారు బాధితులుగా ఉన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, రష్యాకు చెందిన అమ్మాయిలూ ఉన్నారు.
వ్యభిచారం ద్వారా వచ్చిన డబ్బులో 30శాతం బాధిత యువతులకు, 35శాతం యాడ్స్, వెబ్ సైట్స్కు మిగతా 35 శాతం నిర్వాహకులు తీసుకుంటారు. ఆర్నావ్ అనే వ్యక్తి కీలక నిందితుడు. 915 మంది అమ్మాయిలను ముంబై, కోల్కత నుంచి తీసుకొచ్చాడు. 2019 నుంచి సమీర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సరఫరా చేశాడు. ఏపీలోని అనంతపురం, తెలంగాణలోని కరీంనగర్ నుంచి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్లో ఆర్నావ్ డ్రగ్స్, వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడు. సోమాజిగూడలో కీలక నిందితుడు ఆర్నావ్ను అరెస్ట్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆర్నావ్ ఉంటున్న ఇంట్లోనే ఎండీఎంఏ డ్రగ్స్ను సీజ్ చేశామన్నారు. సెక్స్ రాకెట్ ముఠా సభ్యులు వివిధ గ్రూపులుగా విడిపోయి దందా చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కొన్ని హౌటల్స్లో పని చేసే వాళ్ల ప్రమేయం ఉందని, వారిని కూడా అరెస్ట్ చేశామన్నారు. ఉద్యోగాలు లేని అమ్మాయిలను, పేదరికంలో ఉన్న యువతులను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని తమ విచారణలో వెల్లడైందని సీపీ వెల్లడించారు.
ప్రముఖ హౌటల్ మేనేజర్ అరెస్ట్
హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న రాడిసన్ హౌటల్ మేనేజర్ రాకేష్ను పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని హౌటల్స్తో పాటు అత్యంత పేరు పొందిన ఇతర హౌటల్స్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం నమ్మశక్యం కానీ విషయం. ఇదంతా మేనేజర్కు తెలిసి జరిగిందా లేక తెలియక జరిగిందా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసుపై పూర్తి విచారణ చేపడుతామని సీపీ తెలిపారు. ఈ కేసును చేదించిన స్పెషల్ ఆఫీసర్, డీసీపీ కవిత, ఆమె టీంను సీపీ స్టీఫెన్ రవీందర్ అభినందించారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.