Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు
- ఎన్ఆర్ఈజీఎస్ వంటి పథకాలు నిర్వీర్యం
- పెట్టుబడిదారులు పైపైకి.. పేదలు మరింత దిగువకు
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజరు రాఘవన్
- బీజేపీ, టీఆర్ఎస్ ఘర్షణలతో ప్రజాసమస్యలు పక్కదారి
- షర్మిల బీజేపీ వదిలిన బాణమే..! : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ పాలనలో ఆర్థిక, లౌకిక, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజరు రాఘవన్ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. కోవిడ్-19 తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య మరింత ఎక్కువైందన్నారు. పెట్టుబడిదారులు పైపైకి ఎదుగుతుంటే పేదలు మాత్రం మరింత దిగువకు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎన్ఆర్ఈజీఎస్) నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కలిసివచ్చే పార్టీలతో సీపీఐ(ఎం) ముందుకు సాగుతుందని తెలిపారు. ఖమ్మం నగరంలోని స్థానిక సుందరయ్య భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి విజరు రాఘవన్ మాట్లాడారు.
దేశంలో ధరల పెరుగుదల అధికంగా ఉందని పట్టణాలతో పోలిస్తే పల్లెలపై దీని ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం మరింతగా పన్నుల భారం మోపుతుందని ఆరోపించారు. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తోందని మండిపడ్డారు. విచ్చలవిడిగా డబ్బులు వినియోగించి ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను కూలదోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలు, దళితులపై వివక్ష అధికం అవుతున్నదని, అర్బన్ మావోయిజం పుంజుకోంటుందన్నారు. విద్య, ఆరోగ్యం, ప్రజాపంపిణీ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఓవైపు అధిక పనిదినాల కోసం డిమాండ్లు లేవనెత్తుతున్న పరిస్థితుల్లో ఉపాధి కల్పన పథకాలను నిర్వీర్యం చేయడం తగదన్నారు. లేబర్ కోడ్స్, వర్కర్స్ చట్టాలు అమలు కాకపోగా పెట్టుబడిదారీ విధానాలు మరింతగా పుంజుకుంటున్నాయని తెలిపారు. సీఐటీయూ, ఏఐకేఎస్ వంటి సంఘాలను కలుపుకుని వ్యవసాయ కార్మికుల సమస్యలపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
బీజేపీ, టీఆర్ఎస్ ఘర్షణతో
ప్రజాసమస్యలు పక్కదారి : తమ్మినేని
బీజేపీ, టీఆర్ఎస్ ఘర్షణల కారణంగా రాష్ట్రంలో ప్రజాసమస్యలు పక్కదోవ పడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తప్పుచేసిన వారిని శిక్షించడాన్ని సీపీఐ(ఎం) ఎక్కడా తప్పుపట్టదని, విచారణ జరగకుండానే దోష ఆరోపణలు చేస్తూ తిట్టిపోసుకోవడమే పనిగా బీజేపీ, టీఆర్ఎస్ తీరుందని అన్నారు. కేంద్ర నిఘాసంస్థలను ప్రతిపక్షాలపైనే కేంద్రీకరణ చేయడం చూస్తే బీజేపీ తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలనే దుర్భుద్దిని వెల్లడిస్తుందన్నారు. పార్టీల ఫిరాయింపుల కోసం ఓ బాధ్యుడినే కేటాయించడం హాస్యాస్పదమన్నారు. ఒకటి, రెండు ఎన్నికల్లో కొన్నిస్థానాల్లో గెలిచినంత మాత్రాన తామే అధికారంలోకి వస్తామనుకోవడం బీజేపీ అవివేకానికి నిదర్శనమని తెలిపారు. ఫ్యూడలిజాన్ని పారదోలి సెక్యులరిజాన్ని ప్రతిష్టించిన చరిత్ర తెలంగాణ ప్రజానీకనిదని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశాలతో ప్రజాసమస్యలు పక్కదోవ పడుతున్నాయన్నారు. బీజేపీ నాటకాలు, డ్రామాలు ప్రజలు అర్థం చేసుకోలేని స్థితిలో లేరన్నారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమే అని అర్థమవుతుందన్నారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర సర్కారు సైతం వెనుకబడిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రాజెక్టులకు జాతీయ హౌదా, కాజీపేట కోచ్ఫ్యాక్టరీ వంటివేవి కేంద్రం ఆచరణలో పెట్టలేదన్నారు. పోడుభూములు, అసంఘటిత రంగ కార్మికులు, ధరణి సమస్యలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పరిష్కారం దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పోడు సర్వేల్లో లోపాలున్నాయని 36ఏండ్లుగా నివాసం, సొంత భూమిని పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. వలస ఆదివాసీలను రాష్ట్రం నుంచి వెళ్లాగొట్టాలనడం, సర్వేలో వారిని పరిగణలోకి తీసుకోకపోవడం చట్టవిరుద్ధమన్నారు. దళిత బంధుతో పాటు ముస్లిం, బీసీ బంధు వంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వాటిని సైతం అమలుచేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై కోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. రాబోయే కాలంలో జరిగే పోరాటాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) జాతీయ నాయకులు ఎన్. చంద్రన్, కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, కల్యాణం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.