Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయాందోళనలో ప్రజలు
నవతెలంగాణ- ఆసిఫాబాద్
ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆసిఫాబాద్ మండలంలోని రాజుర శివారులో శుక్రవారం ఉదయం పత్తి తీసేందుకు వెళ్లిన స్థానికులు పులిని దూరం నుంచి గుర్తించి ఊర్లోకి పరుగు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా అక్కడికి వెళ్లి పాదముద్రలను గుర్తించి పులి సంచరించినట్టు నిర్ధారించారు. గ్రామ శివారులో వాగులో నీటి కోసం పులి వచ్చినట్టు ఉండొచ్చని అటవీశాఖ అధికారులు అన్నారు. గ్రామస్తులు ఎవరూ కూడా రాత్రిపూట అటవీ ప్రాంతాల్లో సంచరించ వద్దని సూచించారు. ప్రస్తుతం పులి భీంపూర్ వైపు వెళ్లినట్టు నిర్ధారించారు. రాజుర గ్రామ ప్రజలతోపాటు సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామస్తులకు అటవీ అధికారులు అవగాహన కల్పించారు. గ్రామాన్ని సందర్శించిన వారిలో అటవీశాఖ అధికారులు సెక్షన్ అధికారులు సతీష్, రవీందర్, బీట్ అధికారులు రవి, దేవేందర్ ఉన్నారు.