Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి మరో రెండు జాతీయ అవార్డులు
- మంత్రి హరీశ్ రావు హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాతా శిశు సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు మన రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న ''నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్'' కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాత మరణాలను నివారణకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్ డైరెక్టర్ (మెటర్నల్ హెల్త్) డాక్టర్ ఎస్.పద్మజ ఈ అవార్డును అందుకున్నారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఈ విధానంతో నాణ్యమైన ప్రసవ సేవలు గర్భిణులకు మరింతగా చేరువైనట్టు పేర్కొంది. రాష్ట్రంలో ప్రసవ సేవలను మరింత మెరుగు పరిచేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటి వరకు శిక్షణ పొందిన 212 మంది మిడ్ వైఫరీలను 49 ఆస్పత్రుల్లో నియమించింది. వీరు గర్బిణులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, వ్యాయామం చేయించడంతో పాటు, మానసికంగా సంసిద్ధం చేయిస్తున్నారు. ప్రస్తుతం మరో 141 మంది శిక్షణ పొందుతున్నారు. వీరి సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇక హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించడం, చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. మాతృ మరణాలను పూర్తిగా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ''ఎండింగ్ ప్రివెంటబుల్ మెటర్నల్ మోర్టాలిటీ'' (ఇపీఎంఎం) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. హై రిస్క్ గర్భిణులను ముందుగా గుర్తించడం, వారిని నిరంతరం పరిశీలించడం, ఉత్తమ చికిత్స అందేలా రెఫర్ చేయడం కోసం వైద్య అధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలతో ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేసింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. దీంతో హై రిస్క్ కేసులను ముందుగా గుర్తించి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించి, ఆసుపత్రులకు తరలించి, సరైన చికిత్స అందించే అవకాశం కలిగింది.
రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. మరో రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం మా వైద్య సిబ్బంది పనితీరుకు నిదర్శనం. మాతృ మరణాలు తగ్గించడంలో మన పురోగతిని ఇటీవల శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే కూడా వెల్లడించింది. 2014లో 92 గా ఉన్న ఎంఎంఆర్ ఇప్పుడు 43కు తగ్గటం గొప్ప విషయం. ఈ ఘనతలు సాధించడంలో క్షేత్రస్థాయిలో ఉండి వైద్య సేవలు అందించే ఆశాలు, ఏఎన్ఎంల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల నిరంతర కృషి ఉంది... అని పేర్కొన్నారు. వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.