Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్ల కోర్సులో చేరినోళ్లకే అవకాశం
- 75 శాతం మార్కులు తప్పనిసరి
- యూజీసీ మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఇక నుంచి పీహెచ్డీలో ప్రవేశం పొందొచ్చు. ఇప్పటి వరకు పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) పూర్తి చేసిన వారికే పీహెచ్డీలో చేరేందుకు అర్హులుగా ఉన్నారు. నాలుగేండ్ల డిగ్రీ కోర్సులో చేరిన వారికీ పీహెచ్డీ చేసేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అవకాశం కల్పించింది. అయితే 75 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను విధించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను యూజీసీ బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం బీఈ, బీటెక్, ఆనర్స్ డిగ్రీ, బీ పార్మసీ, ఫార్మా-డీ తదితర కోర్సుల్లో విద్యార్థులు పీజీతో నిమిత్తం లేకుండానే పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. అయితే సంబంధిత విద్యార్థులు నాలుగేండ్లు లేదంటే ఎనిమిది సెమిస్టర్లు గల కోర్సులో 75 శాతానికి పైగా మార్కులు సాధించాలి. నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేసిన తర్వాత, ఏడాది వ్యవధి, రెండు సెమిస్టర్ల వ్యవధి గల మాస్టర్స్ కోర్సును పూర్తిచేసిన వారు పీహెచ్డీలో చేరొచ్చని యూజీసీ పేర్కొంది. ఇప్పటి వరకు పీహెచ్డీలో చేరాలంటే పీజీ అర్హతను తప్పనిసరిగా అమలుచేస్తున్నారు. విద్యార్థులు మూడేండ్ల డిగ్రీ, ఆ తర్వాత పీజీ కోర్సు తర్వాత పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు అవకాశమున్నది. ఇలాంటి వారికి జేఆర్ఎఫ్, గేట్, సీడ్, నెట్, సెట్ అర్హతతోపాటు, వర్సిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షల ద్వారా అర్హత పొందినవారు పీహెచ్డీలో చేరుతున్నారు. ప్రవేశ పరీక్షలో 70 శాతం మార్కులకు ఎగ్జామ్, 30 శాతం ఇంటర్వ్యూ, వైవా మార్కుల ఆధారంగా సీట్లను భర్తీచేస్తున్నారు. ఈ విధానం చాలా కాలంగా అమలువుతున్నది. కొత్తగా ప్రతిపాదించిన విధానం వల్ల చాలా మంది విద్యార్థులకు పీహెచ్డీలో చేరేందుకు అవకాశం రానుంది. దేశంలో ఉన్నత విద్యలో నమోదు గణనీయంగా పెరుగున్నది. కానీ పీహెచ్డీ ప్రవేశాలు ఇదే తరహాలో పెరగడం లేదు. అలిండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్హెచ్ఈ) 2019-20 ప్రకారం జాతీయస్థాయిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2.77 కోట్ల మంది విద్యార్థులు చేరితో అదే పీజీకి వచ్చేసరికి 3.19 కోట్ల విద్యార్థులుంటున్నారు. కానీ పీహెచ్డీలో చేరిన వారు కేవలం రెండు లక్షల మంది మాత్రమే ఉంటున్నారు. ఏటా 10 శాతంలోపు మాత్రమే పీహెచ్డీ కోర్సుల్లో చేరుతున్నారు. తాజా సంస్కరణల ఫలితంగా పీహెచ్డీల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.