Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు నుంచి గ్రామాల తరలింపును వేగవంతం చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రక్షిత అటవీ ప్రాంతాలు, పులుల ఆవాసాలను మరింతగా అభివద్ది పరచడం కోసం అడవుల్లో మనుషులు, పెంపుడు జంతువులను తగ్గించటమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. అరణ్యభవన్లో శుక్రవారంనాడామె ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రెండు గ్రామాల (రాంపూర్, మైసంపేట) పునరావాసం ఒక మోడల్ గా ఉండాలనీ, మిగతా శాఖలతో క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని పనులు పూర్తిచేయాలన్నారు. అన్ని హరితవనాల్లో వందశాతం చిక్కటి పచ్చదనం పెంచేలా పెద్ద మొక్కలు నాటాలన్నారు. కోటీ ఎనభై లక్షల మొక్కలు నాటడం లక్ష్యంకాగా ఇప్పటిదాకా సుమారు కోటి మొక్కలు నాటినట్టు అధికారులు తెలిపారు. మిగతా ఎనభై లక్షల మొక్కలను వచ్చే ప్లాంటేషన్ సీజన్లో దశలవారీగా పూర్తి చేయాలని సూచించారు. హరితనిధి నిధుల ద్వారా అభివద్ది చేస్తున్న సెంట్రల్ నర్సరీల పురోగతిపైనా సమావేశంలో చర్చించారు. వచ్చే సీజన్ కల్లా అన్ని నర్సరీల ఏర్పాటు పూర్తి కావాలని ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయనీ, మొత్తం 109 పార్కుల్లో 55 పూర్తికాగా, మరో 54 వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పూర్తయిన ఫారెస్ట్ పార్కులను ప్రజల ఆరోగ్య సందర్శనకు, విద్యార్థులకు పర్యావరణ జ్ఞానం పెరిగేలా జిల్లా అటవీ అధికారులు, సంబంధిత క్షేత్ర స్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ వినరుకుమార్, డీసీఎఫ్ శాంతారామ్, ఓఎస్డీ శంకరన్, కన్సల్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.