Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు ఖమ్మంలో వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగసభ
- అరుణారుణ తోరణాలు.. ఫ్లెక్సీలతో ఎరుపెక్కిన నగరం
- ముస్తాబవుతున్న ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానం
- హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం ఎరుపుమయం అయింది. ఎటుచూసినా అరుణారుణ తోరణాలు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈనెల 29నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో భాగంగా 29వ తేదీ సాయంత్రం ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించేందుకు సంఘం బాధ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ హాజరవుతున్నారు. సుమారు లక్ష మంది వరకు సభకు రావచ్చని అంచనా వేస్తున్నారు. దానికి తగిన విధంగా సభా స్థలి ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. సభా ఏర్పాట్లను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మికసంఘం, రైతుసంఘం నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు.
ఊళ్లన్నీ కదలనున్నారు..
వ్యవసాయ కార్మిక సంఘం నేతల పిలుపునందుకుని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ తదితర చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ఆదివాసీ బిడ్డలు గురువారం ఖమ్మంలో నిర్వహించే బహిరంగసభకు దండుగా కదిలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. మూడువేలకు పైగా లారీలు, బస్సులు, వ్యాన్లను ఇప్పటికే ప్రాంతాల వారీగా స్వచ్ఛందంగా సిద్ధం చేసుకున్నారు. ఈ బహిరంగ సభకు కేరళ సీఎం విజయన్ వస్తుండటంతో.. ఆ రాష్ట్రంలో వ్యవసాయదారులు, కూలీల కోసం అమలవుతున్న పథకాలు, పర్యవసానాలు, ఫలితాలు తెలుసుకోవాలని ఊరూరా జనం కదిలేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రతి ఊళ్లో ప్రచార రథాలు చెమటచుక్కల ప్రాధాన్యం తెలుపుతూ.. కష్టజీవుల కష్టాన్ని దోచుకుంటున్న ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. పాటల పరవళ్లతో బహిరంగ సభ కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి. భక్త రామదాసు కళాక్షేత్రంలో 31వ తేదీ వరకు నిర్వహించే మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా 700 మంది ప్రతినిధులు రానున్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజరురాఘవన్, బి.వెంకట్ మహాసభలో ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు బహిరంగసభకు, ఇటు మహాసభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
ఎరుపెక్కిన ఖమ్మం..
బహిరంగసభ కోసం ఖమ్మం నగరాన్ని అరుణతోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి మొదలు కోదాడ క్రాస్రోడ్, వరంగల్ ఎక్స్ రోడ్, కాల్వడ్డు, త్రీటౌన్లోని గాంధీచౌక్, మార్కెట్ పరిసరాలు, ముస్తఫానగర్ చౌరస్తా, ఇటు పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, మయూరిసెంటర్, సరితా క్లీనిక్ సెంటర్, జడ్పీసెంటర్, ఇల్లెందు క్రాస్రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్ ఇలా ఎటుచూసినా అరుణారుణ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి.
కవాత్ వీరులు.. కళాకారులు..
వ్యవసాయ కార్మికసంఘం బహిరంగ, మహాసభ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం పెవిలియన్గ్రౌండ్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శన కోసం మూడువేల మంది రెడ్షర్ట్ వాలంటీర్లు ఖాకీ పాయింట్, ఎర్రచొక్కాలు, ఎర్ర టోపీ, బూట్లు ధరించి 'ఏక్ దో ఏక్' అంటూ నగర వీధుల్లో కదం తొక్కనున్నారు. వీరిని అనుసరిస్తూ మరో రెండువేల మంది కళాకారులు, ఎర్రచీరలు ధరించిన నారీమణులు ఆటపాటలతో అలరించనున్నారు. బహిరంగసభ ప్రాంగణం ప్రవేశద్వారం మొదలు సభా స్థలి వరకు కేరళ సీఎంకు వీరంతా ప్రత్యేక స్వాగతం పలుకుతారు. మొత్తమ్మీద పోరు ఖమ్మం.. గురువారం కష్టజీవుల గుమ్మంగా మారనుంది.