Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 రకాల కోర్సులు
- అందుబాటులోకి 860 బీఎస్సీ పారామెడికల్ సీట్లు
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. మొత్తం తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బీఎస్సీ అనుబంధ కోర్సులు ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ, కాకతీయ, రిమ్స్, ఉస్మానియా, నిజామాబాద్, సిద్ధిపేట, నల్లగొండ, సూర్యపేట, మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు, వైద్య విద్యను అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా, మరో రెండేండ్లలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు వైద్య విద్య అనుబంధ సేవలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్సీ మొదటి సంవత్సరంలో, 12 వైద్య విద్య అనుబంధ కోర్సులు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2022-23) నుంచే ఈ కోర్సులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మూడేండ్ల కోర్సు, ఒక సంవత్సరం ఇంటర్న్షిప్తో కలుపుకుని నాలుగేళ్ల కాల వ్యవధి ఉంటుంది.
అనస్తీషియా, ఆపరేషన్ థియేటర్, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాలసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్క్యూలార్ టెక్నాలజీ కోర్సులు ఇందులో ఉన్నాయి. తాజా నిర్ణయం వల్ల ప్రతి సంవత్సరం 860 మంది లబ్ది పొందుతారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగు పడనున్నాయి.