Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లా రామప్ప శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. రామప్ప పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2.55 గంటలకు రామప్ప వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు రాష్ట్రపతి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సైతో పాటు దేవాలయంలో రాష్ట్రపతి బృందానికి మంత్రులు డాక్టర్ శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్మెన్ జగదీశ్వర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఐటీడీఏ పీఓ అంకిత్ ఘన స్వాగతం పలికారు. అలాగే రామప్ప దేవాలయానికి చేరుకున్న ఆమెకు వేద పండితులు స్వాగతం పలికారు. కాగా రుద్రేశ్వరుడిని రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్రపతి, గవర్నర్కు మేడారం సమ్మక్క సారలమ్మ సారే (చీర)ను మేడారం ఆదివాసీ పూజారులు అందజేశారు. ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపు కోసం తయారు చేసిన డోసియర్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ బాడీ విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కన్వీనర్ పాండురంగారావు వివరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద రూ.62 కోట్లతో ప్రసాద్ స్కీం పథకాన్ని ప్రారంభించారు. సంస్కృతిని చాటే విధంగా కొమ్ముకోయ కళాకారుల బృందం సమ్మక్క సారలమ్మ ప్రదర్శన, అన్నమాచార్య గీతంపై కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. సాయంత్రం 4.23 నిముషాలకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.