Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ మూడు నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పది పరీక్షల సన్నద్ధతపై అధికారులతో ఆమె బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లతో, వందశాతం సిలబస్తో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందనీ, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని చెప్పారు. నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. సెలవు రోజుల్లో కూడా వాటిని నిర్వహించాలని సూచించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధించాలని ఆదేశించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రి పైనల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణతా శాతం సాధించేలా ప్రభుత్వ పాఠశాలలు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆరు పేపర్లతో 9,10 పరీక్షలు...
తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి ఆయా సంస్కరణలు అమలవుతాయని పేర్కొంది. ఒక్కో సబ్జెక్ట్లో పరీక్షలకు 80, ఫార్మెటివ్ అసెస్మెంట్కు 20 మార్కులు కేటాయిస్తున్నట్టు తెలిపింది. సైన్స్ పేపర్లో ఫిజిక్స్, బయోలజీకి చెరి సగం మార్కులు ఉంటాయని వెల్లడించింది. సైన్స్ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు పరీక్షా సమయం ఉంటుందని పేర్కొంది.