Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ ఏజెంట్లుగా గవర్నర్లు
- ఒకే దేశం, ఒకే విధానం రాష్ట్రాల హక్కులు హరించడమే
- బీజేపీయేతర రాష్ట్రాల్లో ఫెడరల్ వ్యవస్థకు విఘాతం
- జాతీయవాదం, మతోన్మాదంతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్ర
- సామాజిక వివక్ష, మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం
- బీజేపీ ఏజెంట్గా కాంగ్రెస్ గిట్టుబాటు ధర కోసం కొట్లాడాలి
- హక్కుల కోసం పోరాడే సీపీఐ(ఎం) బలపర్చాలి : కేరళ సీఎం విజయన్
ఖమ్మం నుంచి అచ్చిన ప్రశాంత్
'సంక్షేమ పథకాలు ఏమాత్రం ఉచితాలు కాదు.. అవి ప్రజల హక్కు' అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పునరుద్ఘాటించారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రయివేటు, ఆర్థిక విధానాలు వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రం వల్లించే ఒకే దేశం ఒకే విధానం.. ఒకేభాష పేరుతో ముందుకెళ్లడం, కనీసం రాష్ట్రాలను సంప్రదించకుండా పార్లమెంటులో ఇష్టానుసారంగా చట్టాలు చేసుకుంటూ పోవడం రాష్ట్రాల హక్కులను హరించడమేనని అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడో మహాసభ ప్రారంభం సందర్భంగా గురువారం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజయన్ మాట్లాడారు. ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన సుందరయ్య, బసవపున్నయ్యలను దేశానికి ఇచ్చిన గడ్డపై మాట్లాడటం గర్వంగా ఉందని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ, ముదిగొండ భూ పోరాటాలను స్మరించుకున్నారు. ముదిగొండ అమరులకు జోహార్లు అర్పించారు. వలసవాద వ్యతిరేక పోరాటాల స్ఫూర్తిని కేంద్ర పెద్దలు మంటగలుపుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని పక్కనబెట్టి దేశసమగ్రతను దెబ్బతీసేలా మతవాదాన్ని, మతోన్మాదులను నెత్తికెత్తుకుంటున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీరును ఎండగట్టారు. గాడ్సే, సావర్కర్లను కీర్తిస్తూ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడాన్ని తప్పుబట్టారు. జాతీయ వాద నిర్వచనాన్ని హిందుత్వ శక్తులు మార్చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు స్వాతంత్య్రపోరాటంతో ఎటువంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. బ్రిటీష్ వాళ్లకు క్షమాపణలు చెప్పి వారి అడుగులకు మడుగులొత్తిన గోల్వాల్కర్... బ్రిటీష్కు వ్యతిరేకంగా పోరాడవద్దని చెప్పారని అన్నారు. జిన్నా కంటే ముందే రెండు దేశాల సద్దాంతాన్ని సావర్కర్ ప్రతిపాదించాడని గుర్తుచేశారు. దేశంలో మెజార్టీ వర్గాలైన దళిత, ఆదివాసీ, మహిళలు నిరంతరం దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కులం, మతం, జాతి భాష వైషమ్యాలు సృష్టిస్తూ దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టి కార్మిక ఐక్యతను దెబ్బతీసేందుకు కేంద్రంలో పెద్దలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. హిందీ భాషను బలవంతంగా దేశంపై రుద్దటం అందులో భాగమేనన్నారు. తాను హిందీ భాషకు వ్యతిరేకం కాదనీ.. మాతృభాషలను బలవంతంగా నిర్వీర్యంచేసేలా హిందీని రుద్దటం సహేతుకం కాదని హితవు పలికారు. జాతి వ్యతిరేక శక్తులను అభ్యుదయ ప్రజాస్వామ్యవాదులు ఎదుర్కోవాలన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ సంఫ్ు పరివార్ శక్తులు దేశంలో స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. యూపీ, ఒడిశాలో దాడుల్లో గాయపడ్డ మైనార్టీలకు అండగా ఉన్నామనీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. మతపరమైన నిరంకుశత్వాన్ని నిస్సిగ్గుగా బీజేపీ దేశంపై రుద్దుతున్నదనీ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సంఘటితంగా కదంతొక్కాలని పినరయి విజయన్ పిలుపునిచ్చారు. వ్యవసాయం, సహకారం, విద్యుత్, శాంతిభద్రతలకు సంబంధించిన బిల్లులను రాష్ట్రాలను సంప్రదించకుండా నిరంకుశంగా కేంద్రం చట్టాలు చేస్తుందని విమర్శించారు. బీజేపీయేత రాష్ట్రాల్లో గవర్నర్లను రాజకీయ ఏజెంట్లుగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలను బలహీన పర్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. మతోన్మాదం ముసుగులో నూతన ఆర్ధిక విధానాలను ప్రజలపై రుద్గడంతో కార్పోరేట్లు మరింత ధనికులు, పేదలు మరింత పేదలవుతున్నారని చెప్పారు. దేశం సాధించిన ఘనత క్రమేపీ మసకబారుతుందన్నారు. వామపక్షాల పోరాటాలతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. దేశంలో 20 నుంచి 24 ఏండ్ల మధ్యనున్న 42శాతం యువతను మోడీ సర్కారు నిరుద్యోగులుగా మార్చిందన్నారు. 2017-18 నుంచి 2019-20 వరకు దేశంలో మూడుశాతం సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు మారారని తెలిపారు. దేశంలో కార్మికులకు కనీసం ఈఎస్ఐ, పీఎఫ్, ఇతర పథకాలేవీ వర్తించని పరిస్థితి దేశంలో ఉందని చెప్పారు. 82శాతం కార్మికులకు రక్షణ లేదనీ, సరళీకృత ఆర్ధిక విధానాలతో రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 16వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బడ్జెట్లో రైతుల వాటాను 5శాతం నుంచి మూడు శాతానికి తగ్గించిన తీరును వివరించారు. పీఎం కిసాన్ స్కీంలో 67శాతం మంది లబ్దిదారులకు కోత విధించారని తెలిపారు. ఎన్ఎమ్పీ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారనీ, శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ, కేరళలో తమ ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు టేకోవర్ చేసి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నదని చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా విద్యా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పోతున్నామన్నారు. దీని ఫలితంగా విద్య, వైద్య రంగాల్లో కేరళ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో పలు నివేదికలు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇవేకాదు..తమ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందని వివరించారు. దేశంలోనే దినసరి కూలి రూ.830 ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళ అని చెప్పారు. దేశంలో ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పోషించడంలేదని విమర్శించారు. బీజేపీ రిక్రూట్మెంట్ ఏజెన్సీగా మారిందన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికుల పక్షాన పోరాడుతున్న సీపీఐ(ఎం) నిజమైన ప్రతిపక్షం అని చెప్పారు. దేశ ప్రజల హక్కుల రక్షణకు ప్రజలందరూ సీపీఐ(ఎం)ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ గడ్డపై బీజేపీ పప్పులను ఉడకనీయబోం : తమ్మినేని వీరభద్రం
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..కమ్యూనిస్టులు ఎక్కడ అని వాగుతున్న వారికి లక్షలాది వచ్చి నోర్లు మూయించిన ప్రతిఒక్కరికీ ఎర్రెర్రని దండాలు అని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకు రక్షణ కోసం సమగ్ర చట్టాలు చేయాలని ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్లో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికీ మన పాలకులు ఆ చట్టాలను తీసుకురాలేదని విమర్శించారు. పైగా, వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకుగానూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారని తెలిపారు. తమనెవ్వరూ ఏమి చేయలేరని విర్రవీగుతున్న సమయంలో ప్రధాని మోడీ, అమిత్షా మెడలు వచ్చి ఆ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసిన ఘనత ఢిల్లీ రైతాంగ పోరాటానికి ఉందన్నారు. ఆ పోరాటంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల కృషిని ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాకు సాగు నీళ్ల కోసం పాదయాత్ర చేసిన ఘనత సీపీఐ(ఎం)దేనన్నారు. పొత్తులు, సీట్ల కోసం తామెప్పుడూ ప్రయత్నించలేదనీ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే తమకు ముఖ్యమని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగానూ సీఎం కేసీఆర్కు 20 అంశాలపై నివేదిక ఇవ్వగా అందులో కొన్నింటిని పరిష్కరించేందుకు ఆయన ముందుకొచ్చారని చెప్పారు. ఎమ్ఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేరళలో ప్రతి క్వింటా ధాన్యంపై ఎల్డీఎఫ్ ప్రభుత్వం మద్దతు ధర కంటే రూ.800 అదనంగా ఇస్తున్నదనీ, దీని ఫలితంగా ఎకరాకు రైతుకు అదనంగా రూ.24 వేలు దక్కుతున్నదని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర అందుబాటులోకి వస్తే ఇలాంటి ప్రయోజనాలే వస్తాయనీ, ఇక్కడా దీని కోసమే తాము పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో మత సమైక్యతను దెబ్బతీసేలా బీజేపీ యత్నిస్తున్నదన్నారు. అన్ని మతాల వారూ వరుసలు పెట్టుకుని పిలుచుకునే సంప్రదాయమున్న తెలంగాణ గడ్డపై బీజేపీ పప్పులను ఉండకనీయబోమన్నారు. మత ఘర్షణలు సృష్టించో, ఎమ్మెల్యేను కొనో పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ తీరును ఎండగట్టారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్కు మద్దతిచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) పోరాటాలు ఎప్పటిలాగే చేస్తుందని స్పష్టం చేశారు.
మిగులు భూమి చూపుతాం..పంచేందుకు కేసీఆర్ సిద్ధమేనా : బి.వెంకట్
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ..కష్టజీవులకు అండగా ఉండేది కమ్యూనిస్టులేనన్నారు. వ్యవసాయాన్ని అంబానీ, ఆదానీలకు అప్పగించే కుట్రలో మోడీ సర్కారు ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని మిగులు భూమిని తాము చూపెడతామనీ, దాన్ని పంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. మహాసభలో కార్యాచరణ రూపొందించుకుంటామనీ, రానున్న రోజుల్లో రాష్ట్రంలో భూపోరాటాలు చేస్తామన్నారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం కొట్లాడుతామని చెప్పారు. దేశానికి కేరళ మోడల్ అవసరమని నొక్కిచెప్పారు. మతానికి, రిజర్వేషన్లకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్ రవీంద్రనాధ్, ఏఐఏడబ్ల్యూయూ అఖిల భారత అధ్యక్షులు విజయరాఘవన్, కేరళ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రం, చేతివృత్తిదారుల సంఘం నాయకులు చెరుపెల్లి సీతరాములు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, పట్నం కార్యదర్శి డీజీ, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వెస్లీ, స్కైలాబ్బాబు, మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు స్వరాజ్యం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్బేరర్లు, ప్రజాసంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు. కాగా ప్రజానాట్యమండలి కళాకారులు చేసిన ఆటపాటలు అలరించాయి.